పాల కోసం ఏడ్చి.. తనువు చాలించి..

16 Feb, 2015 09:41 IST|Sakshi
పాల కోసం ఏడ్చి.. తనువు చాలించి..
  • ఆరునెలల పసిబాలుడి మృతి.. కాంట్రాక్టర్ పని ఒత్తిడి వల్లే పాలివ్వని తల్లి!
  • హత్నూర: తల్లిపాల కోసం ఆరునెలల పసి బాలుడు ఏడ్చి.. ఏడ్చి తనువు చాలించాడు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మాతృమూర్తికి తీరని గర్భశోకం మిగిలింది. ఈ ఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం తుర్కలఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఓ పరిశ్రమలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామ శివారులో గల ఓ ప్రైవేటు రసాయన పరిశ్రమలో పనిచేసేందుకు కాంట్రాక్టర్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడుకు చెందిన కూలీలను తీసుకొచ్చాడు.

    వీరికి పరిశ్రమ ఆవరణలోనే గుడారాలను ఏర్పాటు చేశాడు. పనులు చేసేందుకు వచ్చిన వారిలో మల్లీశ్వరి అనే ఆమెకు ఆరు నెలల పసి బాలుడు ఉన్నాడు. రోజులాగే ఈ నెల ఏడున తన ఆరునెలల పసి బాలుడిని నివాసంలో పడుకోబెట్టి కుమార్తెను కాపలాగా ఉంచి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత నిద్రి లేచిన బాలుడు ఏడుస్తుండటంతో విషయాన్ని కుమార్తె.. తల్లి దృష్టికి తెచ్చింది. దీంతో మల్లీశ్వరి బిడ్డకు పాలు ఇచ్చి వస్తానని కాంట్రాక్టర్‌ను కోరినా అందుకాయన అంగీకరించలేదు.

    ఈ క్రమంలో ఆ పసికందు ఏడ్చి ఏడ్చి తనువు చాలించాడు. కాంట్రాక్టర్ ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుం డా బాలుడిని నర్సాపూర్‌లోని ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి మల్లీశ్వరిని తన వెంట తీసుకెళ్లాడు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు గానీ.. నర్సాపూర్‌లోని ఓ శ్మశానవాటికలో బాలుడి మృతదేహాన్ని పూడ్చి, ఆమెను  సొంతూరుకు పంపినట్లు తెలిసింది. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని హత్నూర పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు