నెరవేరనున్న 37 ఏళ్ల కల

25 Aug, 2018 14:50 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  

27న పరకాల రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ప్రారంభం

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి

పరకాల : 37 సంవత్సరాల క్రితం పరకాల నుంచి తరలించుకుపోయిన రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో ఈ నెల 27న ప్రారంభించుకోబోతున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలి పారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వపరిపాలనే లక్ష్యంగా 10 జిల్లాల తెలం గాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా, కొత్త రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు, మండలాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గతంలో పరకాల రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ములుగుకు తరలించడంలో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉండగా ప్రస్తుత జయశంకర్‌ జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి మండలాలతో ఉన్న పరకాల నియోజకవర్గాన్ని కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ముక్కలు చేసి పరకాల ప్రజలకు అన్యాయం చేశారన్నారు.

పరకాలలోని అన్నివర్గాల ప్రజల పోరాటాలతో 2017 అక్టోబర్‌ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణం శంకుస్థాపన సభలో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాన్ని ప్రకటించి 2018 ఏప్రిల్‌ మొదటి వారంలో గెజిట్‌ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న సోమవారం ఆర్డీఓ కార్యాలయ ప్రారంభంతో పరకాల రెవెన్యూ డివిజన్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, మంత్రి హరీష్‌రావు, స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, వరంగల్‌ ఎంపీ దయాకర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ,  కార్పొరేషన్‌ చైర్మన్లు లింగంపల్లి కిషన్‌రావు, రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, వాసుదేవరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. డివిజన్‌ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నడికూడ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించిన తర్వాత 10.30 గంటలకు పరకాల రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ కొంపెల్లి ధర్మారాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొచ్చు వినయ్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ పావుశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు దుబాసి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు