తేల్చే వరకు తెగించి కొట్లాడుడే..

11 Oct, 2019 10:42 IST|Sakshi
తెలంగాణ చౌక్‌ నుంచి బస్టాండ్‌కు ర్యాలీగా వస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు

సాక్షి, మంకమ్మతోట(కరీంనగర్‌)/హుజూరాబాద్‌ : సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. కార్మికులకు ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది. ఆర్టీసీ సమ్మె గురువారం ఆరో రోజుకు చేరుకుంది. దసరా పండుగ వరకు వేచి చూసిన కార్మికులు పోరాటాలను క్రమంగా ఉధృతం చేస్తున్నారు. జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి తెలంగాణచౌక్‌ మీదుగా బస్టాండ్‌వరకు అఖిప పక్షం నాయకులు,  ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ చౌరస్తాలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలుపారు. కార్మికులు బస్టాండ్‌ ఆవరణలోని డిపోల వద్ద ఆందోళన చేశారు. హుజూరాబాద్‌లో ఆర్టీసి డిపో నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు.

తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్డీవో చెన్నయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వ ఇచ్చే రాయితీలు చెల్లించాలని, అన్ని రకాల ట్యాక్స్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఖండించారు. దసరా పండుగ జరుపుకుని తిరుగి వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్‌ రద్దీగా కనిపించింది. కార్మికులెవరూ విదులకు హాజరు కాలేదు. అ«ధికారులు ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించే ఏర్పాటు చేశారు.  బస్సుల్లో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపించారు.  

                       హుజూరాబాద్‌ ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఆర్టీసీ కార్మికులు
వెనుకడుగు వేయం..  
ప్రభుత్వం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపేంతవరకు సమ్మె విషయంలో వెనుకగుడు వేసేది లేదని, ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామని అఖిల పక్ష నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీని విలీనం చేసి  కార్మికులకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సాధించుకుంటే మన రాష్ట్రంలో మన నీళ్లు, మన నిధులతో బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పి పండుగ పూట కార్మికుల కుటుంబాలను పస్తులుంచిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల జీతభత్యాల సవరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు రావాల్సిన అన్ని బెన్‌ఫిట్స్‌ ప్రభుత్వం కల్పించాలని, కార్మికులు సంతోషంగా ఉంటేనే ఏసంస్థ అయినా అభివృద్ధి పథంలో నడుస్తుందనే విషయాన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

వెంటనే  ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరుపాలని డిమాండ్‌ చేశారు. సంఘీభావ ర్యాలీలో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, నగర అధ్యక్షుతు బేతి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శులు కూన శోభారాణి, సృజన్‌కుమార్, ఏఐటీయుసీ నాయకుడు టేకుమల్ల సమ్మయ్య,టీడీపీ నగర అధ్యక్షుడు ఆగయ్య, జేఏసీ నాయకులు జక్కుల మల్లేశం, కె.సురేందర్‌రాజు, గుర్రాల రవీందర్,  టీఆర్‌.రెడ్డి,  ఎన్‌కె.రాజు, ఎంపీ.రెడ్డి, కాళిదాసు,  ఆర్టీసీ జేఏసీ నాయకులు పీఎల్‌.రావు, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, రమేశ్, జె.రవీందర్, టీఎస్‌.సింగ్,  యాకుబ్‌పాషా, సమ్మిరెడ్డి, సర్దార్, అశోక్‌బాబు, రాజమణి, ఎస్‌ఎస్‌.రాణి, విజయలక్ష్మి, శ్రీదేవి, పద్మ, సారయ్య, ఎన్‌వీ రెడ్డి, యూసఫ్‌అలీ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

ఆర్టీసీ 567 బస్సులు ఏర్పాటు.. 
సమ్మె జరుగుతున్నప్పటికీ తాత్కాళిక డ్రైవర్లు, కండక్టర్లతో గురువారం మొత్తం 642 బస్సులకుగాను 567 బస్సులు నడిపించినట్లు ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ తెలిపారు. 364 మంది  తాత్కాలిక డ్రైవర్లు, 364 మంది కండక్టర్లతో బస్సులు నడిపిస్తున్నారు. 1.03 లక్షల కిలోమీటర్లు బస్సులు నడుపగా  రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు