హింసిస్తున్న ఎంఈఓ

19 Feb, 2018 16:08 IST|Sakshi
ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తున్న ప్రైవేట్‌ పాఠశాలల యజమానులు

ఎమ్మెల్యేకు ప్రైవేట్‌ పాఠశాలల యజమానుల విన్నపం

పటాన్‌చెరు: మండల విద్యాధికారి తమను అనవసరంగా వేధిస్తున్నారని మండల పరిధిలోని ప్రైవేట్‌ పాఠశాలల యజమానుల సంఘం ఆరోపించింది. ఆదివారం వారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కలిసి తమ బాధలను ఆయనతో ఏకరువు పెట్టారు. తమను బూతులు తిడుతున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. మరో రకంగా చెప్పాలంటే తమను హింసిస్తున్నాడని, ఆ ఎంఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కొన్ని పాఠశాలల మహిళా కరస్పాండెంట్‌లను వ్యక్తిగతంగా రావాలంటూ వేధిస్తున్నాడని ఆరోపించారు.

అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా తాము ఇలాంటి విద్యాధికారిని చూడలేదన్నారు. ఇటీవల ఓ కరస్పాండెంట్‌ను సమావేశం పేరుతో పిలిచి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యేకు వివరించారు. ఆ సంఘటనతో ఆ కరస్పాండెంట్‌ కన్నీటి పర్యంతమయ్యారని వారు చెప్పారు. చాలా ఇబ్బందికరంగా, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. పటాన్‌చెరు ఎంఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు, అమీన్‌పూర్‌కు చెందిన ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. వీరిలో సంఘం ప్రతినిధులు టి.ప్రమోద్, రాఘవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు