ఈఎస్‌ఐలో ఇక్కట్లు

16 Apr, 2019 07:49 IST|Sakshi
నీరసంతో నేలపై కూర్చున్న మహిళలు, వైద్య పరీక్షల కోసం క్యూలో నిల్చున్న రోగులు

రోగులకు సకాలంలో అందని వైద్యం

గంటల తరబడి క్యూలోనే నిరీక్షణ

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు

అమీర్‌పేట్‌: సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ వైద్య కళాశాల బోధన ఆస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. కార్డు లబ్ధిదారుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓపీ (ఔట్‌ పేషెంట్‌ బ్లాక్‌) విభాగంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో రోగులు ఓపీ బ్లాక్‌కు వస్తుంటారు. రోగులకు రద్దీకి అనుగుణంగా వైద్యులు ఉండటం లేదు. ముందుగా ఇన్‌పేషెంట్లను చూసి ఓపీకి ఆలస్యంగా వస్తుండటంతో రోగులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8 గంటలకే ఓపీకి వచ్చి క్యూలైన్‌లో ఉన్నప్పటికి 10 గంటల తర్వాతే వైద్యులు వస్తున్నారని  రోగులు ఆరోపిస్తున్నారు. టెస్టుల చేస్తారేమోనని తినకుండా ఆస్పత్రి వచ్చేవారు స్పృహ తప్పి పడిపోతున్నారని చెబుతున్నారు. ప్రతిరోజూ నిర్ణీత సమయం వరకే ఓపీ ఉంటున్నందున ముందుగా ఓపీకి వచ్చే రోగులకు పరీక్షించి అనంతరం వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరీక్షించాలని కోరుతున్నారు. లేని పక్షంలో వైద్య సిబ్బందిని పెంచి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు