సీఎస్‌టీ బకాయిలు వెంటనే చెల్లించండి

28 May, 2015 02:37 IST|Sakshi

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ఈటల రాజేందర్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన సీఎస్‌టీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీకి వచ్చిన ఈటల టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్, ఢి ల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను వారి కార్యాలయాల్లో కలిశారు. అనంతరం నార్త్‌బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ఆడపడుచులకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి ఓ లేఖ రాశారు.

దానిలో చేసిన విజ్ఞప్తి మేరకు 20 లక్షల గ్యాస్ కనెక్షన్లను వచ్చే రెండేళ్లలో ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరాం’ అని ఈటల తెలిపారు. అదేవిధ ంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో రాష్ట్రానికి కేంద్ర నుంచి రావాల్సిన రూ.6,600 కోట్ల సీఎస్‌టీ బకాయిలను విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న స్మార్ట్ సిటీల్లో రాష్ట్రంలో రెండు పట్టణాలను గుర్తించనున్నట్టు వార్తలు వస్తున్నాయని, అయితే ఐదు పట్టణాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. పట్టణాభివృద్ధిశాఖ అధికారులను రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున ఆహ్వానించినట్టు తెలిపారు.
 

మరిన్ని వార్తలు