మళ్లీ పాత బిల్లే..

11 May, 2020 13:25 IST|Sakshi

ఈనెల కూడా మీటర్‌ రీడింగ్‌ లేకుండానే విద్యుత్‌ చార్జీలు

2019 ఏప్రిల్‌ బిల్లు ఆధారంగా వసూలు

వినియోగదారుల సెల్‌కు మెసేజ్‌ పంపనున్న అధికారులు

కొత్తగూడెంటౌన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ తీసే సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. దీంతో 2019 మార్చి నెలలో వచ్చిన బిల్లు మొత్తాన్నే ఈ ఏడాది మార్చిలో వసూలు చేశారు. ఏప్రిల్‌లో సైతం గత ఏడాది బిల్లు ఆధారంగానే వసూలు చేయాలని విద్యుత్‌ అధికారులు నిర్ణయించారు. పాత బిల్లు ఎంత చెల్లించారనే వివరాలను వినియోగదారుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపించామని, దాని ప్రకారం ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాలని అంటున్నారు. జిల్లాలో అన్ని రకాల విద్యుత్‌ కనెక్షన్లు కలిపి 3,91,793 ఉన్నాయి. ఇందులో గృహాల కనెక్షన్లు 3,12,332 ఉన్నాయి. లాక్‌డౌన్‌తో బిల్లుల రీడింగ్‌ తీసే అవకాశం లేకపోవడంతో పాత బిల్లు మొత్తాన్ని తీసుకుంటున్నామని, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత రీడింగ్‌ తీసి హెచ్చుతగ్గులు ఉంటే సరి చేస్తామని అధికారులు చెపుతున్నారు.

 అన్‌లైన్‌లోనే చెల్లించి సహకరించండి
ప్రతి వినియోగదారుడు బాధ్యతగా అన్‌లైన్‌లో బిల్లు చెల్లించి సహకరించాలి. మార్చి మాదిరిగానే ఏప్రిల్‌లో కూడా 2019 నాటి బిల్లునే కొలమానంగా తీసుకుని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపించాం. ప్రతి ఒక్కరూ మెసేజ్‌ చూసుకుని బిల్లు చెల్లించాలి.  టీఎస్‌ ఎన్‌పీడీఎస్‌ఎల్‌ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌లతో పాటు ఫోన్‌ పే, పేటీఎం, టీఎస్‌ అన్‌లైన్, మీ సేవ కేంద్రాల్లోనూ బిల్లులు చెల్లించవచ్చు.  – ఎ.సురేందర్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు