ఆసరా అందించండి

8 Nov, 2014 00:04 IST|Sakshi

సంగారెడ్డి అర్బన్:  పింఛన్ల పంపిణీ కార్యక్రమం ‘ఆసరా’ను శనివారం అధికారికంగా ప్రారంభించాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా శుక్రవారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పింఛన్ల పంపిణీ నిర్వహించాలన్నారు.

దీనిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక శాసన సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగేలా చూడాలని సూచించారు. పెన్షన్లు ఇచ్చేందుకు మండల పరిధిలోని గ్రామాల నుంచి తీసుకువచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలన్నారు. లబ్ధిదారులను క్షేమంగా తిరిగి వారి గ్రామాలకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం యథావిధిగా ఆయా గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. పింఛన్లు అందజేసే చోట వైద్య శిబిరం మంచినీటి సౌకర్యం, తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో మెదక్ డివిజన్ నుంచి జేసీ డా.ఎ.శరత్ , డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జడ్పీ ఇన్‌చార్జ్ సీఈవో, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓలు మధుకర్‌రెడ్డి, వనజాదేవి, ముత్యంరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు