కొందరికే.. పింఛన్లు..?

11 Apr, 2018 13:10 IST|Sakshi

గ్రేడ్‌–3 దశలో ఉన్న బోధకాలు బాధితులకు మాత్రమే..

వివరాల సేకరణకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఇప్పటికే సర్వేను పూర్తి చేసిన వైద్యసిబ్బంది

జిల్లా వ్యాప్తంగా 520మంది ఉన్నట్లు గుర్తింపు

భువనగిరి : బోధకాలు బాధితులందరికీ పింఛన్‌కాకుండా ఆ వ్యాధి గ్రేడ్‌–3 దశలో ఉన్న వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గ్రేడ్‌–3 దశలో ఉన్న వారిని గుర్తించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైద్య సిబ్బంది ఇటీవల జిల్లావ్యాప్తంగా బోధకాలు వ్యాధి లక్షాణాలు ఉన్న 1,818 మందికి తిరిగి పరీక్షలు నిర్వహించారు. ఇందులో గ్రేడ్‌–3 దశలో 520 మంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం 520 మందికి మాత్రమే పింఛన్లు వచ్చే అవకాశం ఉంది.

కొత్తగా ఉత్తర్వులు..
ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో నిర్వహించిన జాతీయ ఫైలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి కేసీఆర్‌ బోధకాలు బాధితులకు ప్రతినెలా రూ. 1,000ల చొప్పున పింఛన్‌ అందజేస్తామని ప్రకటిం చా రు. దీంతో జిల్లాలో ఉన్న 1,818మంది బోధకాలు బా ధితులకు పింఛన్‌ అందుతుందని సంతోషపడ్డారు. కా నీ కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రేడ్‌–3 దశలో ఉన్నవారికే పింఛన్‌ అందజేయాలని నిర్ణయించింది.  దీంతో జిల్లాలో ఇటీవల గ్రేడ్‌–3 దశ బోధకాలు లక్షణాలు ఉన్న బాధితుల కోసం సర్వే చేశారు. ఇందులో భాగంగా గ్రేడ్‌–1 దశలో 531 మంది, గ్రేడ్‌–2 దశలో 703 మంది, గ్రేడ్‌–3 దశలో 520 మంది ఉన్నట్లుగా గుర్తించారు. మిగిలిన ఏడుగురి బాధితులు అం దుబాటులో లేరు. దీంతో ప్రస్తుతం జిల్లాలో బోధకాలు లక్షాణాలు ఉన్నవారు 1,761 మందిగా గుర్తించారు.

520 మందికే పింఛన్‌..
జిల్లాలో ఇటీవల బోధకాలు లక్షణాలు ఉన్న వారికి జరిపిన పరీక్షల్లో గ్రేడ్‌–3 దశ లక్షణాలు కలిగిన 520 మందికి పింఛన్‌ రానుంది. గ్రేడ్‌–1 దశలో బోధకాలు సాధారణ లక్షణాలు ఉంటాయి. గ్రేడ్‌–2 దశలో పనిచేసే విధంగా లక్షణాలు కలిగి ఉంటాయి. గ్రేడ్‌–3 దశలో ఏమాత్రం పనిచేయకుండా లక్షణాలు కలిగిన బోధకాల బాధితులుగా విభజించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొంతమందికే పింఛన్‌ వచ్చే అవకాశం ఉండడంతో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు.

నివేదిక అందజేస్తాం..
ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఇటీవల జిల్లాలోని బోధకాలు లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు నిర్వహించాం. ఇందులో బోధకాలు లక్షణాలు ఉన్నవారిని మూడు విభాగాలుగా విభజించాం. పూర్తి చేసిన సర్వే నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తాం. – డాక్టర్‌ సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు