మభ్యపెట్టి విజయం సాధించారు

27 Dec, 2018 03:03 IST|Sakshi

టీఆర్‌ఎస్‌కు ప్రజలు శాశ్వత అధికారాన్ని కట్టబెట్టలేదు

సీపీఐ నేత సురవరం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను తాత్కాలికంగా మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్‌ఎస్‌ అనుకున్న విజయాలు సాధించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు టీఆర్‌ఎస్‌కు శాశ్వతంగా అధికారాన్ని కట్టబెట్టలేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. సంక్షే మ పథకాలను ఒక భిక్ష రూపంలో కాకుండా సొంత కాళ్లపై నిలబడేలా చేయగలిగినప్పుడే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అది సోషలిజం వ్యవస్థలోనే సాధ్యమని, దానికోసం కృషి సాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడబోయే విశాల ఐక్యవేదిక విచ్ఛిన్నం చేసే పనిని సీఎం కేసీఆర్‌ కొనసాగిస్తున్నారని విమర్శించారు.

బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు లక్ష్యమైతే గత నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎందుకు బలపరచారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని సురవరం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కుంటున్నదని, ప్రతి అపజయం నుంచి కొత్త గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం సవాళ్లను ఎదుర్కొంటున్నా జాతీయ స్థాయిలో బీజేపీ ఫాసిస్ట్‌ విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
 
మిలిటెంట్‌ ఉద్యమాలకు సిద్ధం కావాలి: చాడ
బీజేపీ మతోన్మాద విధానాలు ఎండగట్టేందుకు మిలి టెంట్‌ తరహా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలందరికీ మౌలిక అవసరాలు తీర్చేందుకు పోరాటాలు చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, టి. శ్రీనివాసరావు, కందిమళ్ల ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు