31 లబ్‌ డబ్‌

31 Mar, 2020 10:33 IST|Sakshi

క్వారంటైన్‌ముగుస్తుండటంతో కేసులు భారీగా వచ్చే అవకాశం

వెంటాడుతున్న లోకల్‌ కాంటాక్ట్‌ల ఆందోళన  

ఎంత చెప్పినా వినిపించుకోని నగరవాసులు

మార్కెట్లకు గుంపులుగా జనం.. ఇప్పటికీ రాని స్పృహ

ఆది, సోమవారాల్లో రోడ్లపైకి భారీగా వచ్చిన ప్రజలు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ వాసులకు 31వ తేదీ భయం పట్టుకుంది. కరోనా వైరస్‌ ఇంకుబేషన్‌ పీరియడ్‌ దగ్గర పడుతుండటమే ఇందుకు కారణం. మార్చి 15 తర్వాత విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారిలో చాలా మందికి మంగళవారంతో విముక్తి లభించనుంది. మరికొంత మందికి ఏప్రిల్‌ 7తో విముక్తి లభించనుంది. గత వారం రోజులతో పోలిస్తే.. మంగళవారం నుంచి ఏప్రిల్‌ 7 వరకు అత్యంత కీలకం కానుంది. కొత్తగా అనేక కేసులు వెలుగులోకి రానున్నాయి. క్వారంటైన్‌లో ఉన్నవారి సంగతి ఇలా ఉంటే.. ఇప్పటికే లోకల్‌ కాంటాక్ట్‌ కూడా ప్రారంభమైంది. ఇతర ప్రాంతాల్లో పర్యటించకపోయినా చాపకింద నీరులా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటి వరకు 70కిపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. చికిత్స తర్వాత ఒకరు పూర్తిగా కోలుకుని ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా మరో 11 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 60పైగా పాజిటివ్‌ కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనివే. వీటిలో అత్యధిక కేసులు ఆ నాలుగు కుటుంబాల నుంచి రిపోర్టైనవే.

చాపకింద నీరులా లోకల్‌ కాంటాక్ట్‌..
విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం లేకపోయినప్పటికీ ఇప్పటికే పలువురు కుటుంబ సభ్యులు వైరస్‌ బారినపడ్డారు. నాంపల్లి సహా పాతబస్తీ, కుత్బుల్లాపూర్, దోమలగూడ, కొండాపూర్, సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డుకు చెందిన పాజిటివ్‌ బాధితుల కుటుంబాల్లో ఇప్పటికే థర్డ్‌ కాంటాక్ట్‌ మొదలైంది. ఇలా 15 మంది వరకు ఉన్నారు. తాజాగా నాంపల్లికి చెందిన 18 నెలల బాలుడికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఒక వైపు క్వారంటైన్‌ టైమ్‌ ముగుస్తుండటం, మరోవైపు లోకల్‌ కాంటాక్ట్‌ల సంఖ్య పెరుగుతుండటంతో గ్రేటర్‌ వాసుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల క్రితం మృతి చెందిన ఖైరతాబాద్‌ వృద్ధునికే 200 మందికిపైగా క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. నిలోఫర్‌లో చికిత్స పొందిన బాలునికి 70 మంది వరకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇక దోమలగూడలోని డాక్టర్‌ దంపతులకు 50 మందికిపైగా ఉంటే, ఎంజీ రోడ్డులోని వ్యాపారికి పది మంది వరకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నారు. పాజిటివ్‌ బాధితులకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో 2500 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. 14 రోజుల్లోపు వైరస్‌ లక్షణాలు బయటపడే అవకాశం లేకపోలేదు. ఎంత మందికి కరోనా విస్తరించిందో తెలియక గ్రేటర్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమకు ఈ వైరస్‌ సోకిందోనని భయాందోళన చెందుతున్నారు. 

జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని తుంగలో తొక్కి..
ప్రస్తుతం వైరస్‌ చాపకింద నీరులా ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. రోజుకు సగటున ఐదు నుంచి పది పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి రోజుకు సగటున 200 మంది వస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 మంది ఐసోలేషన్‌ వార్డుల్లో అడ్మిటవుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తున్పటికీ.. ప్రజల్లో సామూహిక దూరంపై కనీస స్పృహ ఉండటం లేదు. జనత కర్ఫ్యూ స్ఫూర్తిని తుంగలో తొక్కి గుంపులు, గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. వీరిలో చాలా మంది కనీస జాగ్రత్తలు పాటించడం లేదంటే ఆశ్చర్యపోనసరం లేదు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు ఎంత చెప్పినా విన్పించుకోకుండా నిత్యావసరాల కొనుగోలు పేరుతో గుంపులు గుంపులుగా మార్కెట్లకు వచ్చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు