స్వామీజీ బహిష్కరణపై నిరసనలు

14 Aug, 2018 11:28 IST|Sakshi
ఖమ్మంలో ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం   

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ప్రదర్శన

కలెక్టరేట్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట

పలువురు అరెస్ట్, 50 మందిపై కేసు నమోదు

కొత్తగూడెం అర్బన్‌: విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పరిపూర్ణానందస్వామిపై బహిష్కరణ వేటు ఎత్తి వేయాలని కోరుతూ బీజేపీ, బీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గణేష్‌ టెంపుల్‌ ఏరియా నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన సూపర్‌బజార్‌ మీదుగా బస్టాండ్‌ చేరుకుని కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్లే సమయంలో పోలీసులు స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌ వద్ద అడ్డగించి, అరెస్టు చేసి వ్యాన్‌లో ఎక్కించారు.

ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఇందులో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కింద పడ్డారు. అనంతరం పోలీసులు అరెస్టు చేసిన మిగిలిన ఆందోళనకారులను వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిపూర్ణానందస్వామిపై బహిష్కరణను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు.

దీంతో పాటుగా కొన్ని టీవీ చానెల్స్‌లో హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, వారి మనోభావాలను కించపరిచేలా అవహేళన చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేయడం సరైన పద్దతి కాదన్నారు. అటువంటి చానెల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ ముట్టడి చేసే క్రమంలో పోలీసులు నాయకులు, కార్యకర్తలను కొట్టి, బలవంతంగా వ్యానులో ఎక్కించి స్టేషన్‌కు తరలించడం సరికాదన్నారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులను వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించిన అనంతరం 50 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా సీతారామ్‌ నాయక్, శ్రీనివాసరావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు యేర్రా కామేష్, వీహెచ్‌పీ జిల్లా నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, భజరంగ్‌దళ్‌ నాయకులు బరిగంటి సురేష్, కుమార్, వినోద్‌రెడ్డి, లక్ష్మీ, సరోజ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు రామచంద్రయ్య, రాజేశ్వరరావు, పార్థసారధి, ఏబీవీపీ నాయకులు నరేందర్‌ పాల్గొన్నారు. 

ఖమ్మం(కల్చరల్‌) : పరిపూర్ణనందస్వామిపై విధించిన నగర బహిష్కరణను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ విశ్వ హిందు పరిషత్, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లిక అంజయ్య, ఉపాధ్యక్షుడు ఉన్నం వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ చేయటం ఎంత వరకు సమంజసమన్నారు.

బహిష్కరణ ఎత్తివేయకుంటే ఆందోళనలు ఉ«ధృతం చేస్తా మని హెచ్చరించారు. తొలుత నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట, వాగ్వివాదం జరిగి ంది. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

వీరి ఆందోళనకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సన్నె ఉదయ్‌ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ, గల్లా సత్యనారాయణ తదితరులు మద్దతు పలికారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రముఖ్‌ కొచ్చర్ల రమాదేవి,  కోశాధికారి పసుమర్తి రవి, హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు పోతుల వీరచంద్రశేఖర్, మిక్కిలినేని సునీల్, శివసాయి చౌదరి, దేవేందర్, రుద్ర ప్రదీప్, వేల్పుల సుధాకర్, భుక్యా శ్రీను, జైపాల్‌రెడ్డి, ఉపేందర్, ఇంద్రఐక్య వేదిక కన్వీనర్‌ పిట్టల లక్ష్మీనారాయణ, ఏబీవీపీ సంఘటన యాత్రి మహిపాల్‌ పృథ్వీ,సాయి, గోపి  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు