మాకు సాయం అందించండి 

26 Mar, 2020 03:11 IST|Sakshi

ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌కు వినతుల వెల్లువ 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమకు సాయం అందించాల్సిందిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ ద్వారా పలువురు విజ్ఞప్తి చేశారు. వైద్యం కోసం వెళ్లేందుకు కొందరు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తమ వారి కోసం మరికొందరు కేటీఆర్‌ సా యాన్ని అర్థిస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా వందల కొద్దీ వినతులు వస్తుండటంతో సాయం అందించాల్సిందిగా తన కార్యాలయ సిబ్బందిని కేటీఆర్‌ ఆదేశిస్తున్నారు. నిత్యావసరాలు, ఆహారం సరఫరా చేసే బిగ్‌ బాస్కెట్, అమెజాన్, గూఫర్స్‌ తదితర సంస్థల సేవలకు అనుమతి ఇవ్వాలనే విజ్ఞప్తికి కేటీఆర్‌ స్పందిస్తూ, నిర్దేశిత సమయాల్లో అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

హాస్టళ్లలో ఉండేందుకు యజమానులు అనుమ తించడం లేదని, తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందిగా పలువురు విజ్ఞప్తి చేశారు. సంబంధిత హాస్టల్‌ యజమానులతో మాట్లాడి సమస్య పరిష్క రించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ వర్గాలను కేటీఆర్‌ ఆదేశించారు. విజయనగరం కోరుకొండ సైనిక పాఠశాలలో చిక్కుకుపోయిన 16 మంది తెలంగాణ విద్యార్థులను రాష్ట్రానికి రప్పిస్తామని కేటీఆర్‌ హా మీ ఇచ్చారు. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లాలని కొందరు, దూర ప్రాం తంలో ఉన్న తమ వారిని చేరుకోవాలని కొందరు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశా రు. వచ్చే మూడు వారాల పాటు అందరి సమష్టితత్వానికి పరీక్షా సమయమని, ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన వారి కి చేయూత అందించాల్సిందిగా ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

వెల్‌కమ్‌.. ఒమర్‌సాబ్‌  
232 రోజుల గృహ నిర్బంధం తర్వాత బయటకు వచ్చిన నేను మరో 21 రోజులు వేచిచూడక తప్పదు. అందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండండి. ఎవరికైనా క్వారంటైన్‌ సమయంలో ఎలా గడపాలో సలహాలు కావాలంటే చెప్పండి. నాకు ఈ విషయంలో నెలల తరబడి అవగాహన ఉంది’అంటూ జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ వేదికగా ఛలోక్తి విసిరారు. దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ‘వెల్‌కమ్‌ బ్యాక్‌ ఒమర్‌ సాబ్‌. మీరు లాక్‌డ్‌ ఇన్‌ నుంచి లాక్‌డ్‌ ఔట్‌లో అడుగుపెట్టినట్లున్నారు’అని బదులిచ్చారు.

మరిన్ని వార్తలు