టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలంతా విసిగిపోయారు..

2 Dec, 2018 11:12 IST|Sakshi
గోపాల్‌పేటలో మాట్లాడుతున్న చిన్నారెడ్డి

సాక్షి, గోపాల్‌పేట: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి జి.చిన్నారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శనివారం ఆయన నాగం తిరుపతిరెడ్డితో కలిసి గోపాల్‌పేట మండల కేంద్రంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలంతా విసిగిపోయారని, ఓటు వేసే పరిస్థితిలో లేరని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్లలోనే లక్ష ఉద్యోగాలను భర్తీచేస్తామని స్పష్టంచేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాల్లో ఉన్న వారికి రూ.50వేల చొప్పున రుణమాఫీ చేస్తామని తెలిపారు. తెల్లకార్డున్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. సుధాకర్, రమేష్‌ ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 80 మంది చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం  చెన్నారంలో రాంచందర్‌ ఆద్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గణేష్‌ గౌడ్, మురళిగౌడ్, జెడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్సీసెల్‌ కన్వీనర్‌ కొంకి వెంకటేష్, బాలస్వామి, అమర్‌ పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు