‘ఆసరా’ అభాసుపాలు

11 Dec, 2014 00:14 IST|Sakshi

సంగారెడ్డి మున్సిపాలిటీ : భర్త బతికుండగానే భార్యకు వితంతు పింఛన్.. మరో వ్యక్తి ఎటువంటి ైవె కల్యం లేకున్నా.. అతడికీ పింఛన్.. అధికార పార్టీకి చెందిన ఓ నేతకు చేనేత కార్మికుడిగా గుర్తించి అతడికీ పింఛన్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. తాము అర్హులమని పింఛన్లు ఇవ్వాలని ఆధారాలతో పాటు కాళ్లకు చెప్పులు అరిగే లా తిరుగుతున్నా వారిని కాదని అధికారులు అనర్హులకు పింఛన్ జాబితాలో చోటు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని 31 వార్డుల్లో వివిధ రకాల పింఛన్ల కోసం 5,360 దరఖాస్తులు రాగా 2,571 దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్ పూర్తి చేయగా అందులో 1,900 వివిధ రకాల పింఛన్లను మంజూరు చేశారు.

అందులో 22వ వార్డులో పింఛన్ జాబితాలో పట్టణంలోని టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్, ఎమ్మెల్యే సన్నిహితుడుగా ఉన్న హెచ్ హరి కిషన్‌కు చేనేత కార్మికుడిగా గుర్తించి రూ. 1000 పింఛన్‌ను మంజూరు చేస్తూ అధికారులు బుధవారం మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రకటించిన జాబితాలో పేర్కొన్నారు. దీంతో పాటు సోమేశ్వర్‌వాడ 18వ వార్డుకు చెందిన సయ్యద్ నేహకు వికలాంగురాలిగా గుర్తించి గత నెలలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా రూ.1500 తీసుకున్నా.. బాలిక ప్రస్తుతం అధికారులు  వితంతు పింఛన్‌ను మంజూరు చేశారు.

16వ వార్డులో సరస్వతి భర్త బతికి ఉండగానే ఆమెకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఒకటో వార్డుకు చెందిన సుజాతకు కూడా భర్త బు చ్చిరాములు బతికే ఉండగా ఆమెకు సైతం వితంతు పింఛన్ మంజూరైంది. రజీయాబేగం భర్త బతికి ఉండగానే ఆమెకు వితంతు పింఛన్ మంజూరైం ది. వాస్తవానికి ఆమె భర్త వృద్ధ్యాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు వితంతు పింఛన్ మంజూరు కావడం గమనార్హం.

కమిషనర్ వివరణ : టీఆర్‌ఎస్ నాయకుడు పింఛన్ మంజూరు చేయడంపై ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ గయాజుద్దీన్‌ను వివరణ కోరగా కంప్యూటర్ ఆన్‌లైన్లో నమోదు చేసే క్రమంలో పొరపాట్లు జరిగాయని వాటిని సవరిస్తామన్నారు. అనర్హులకు పింఛన్ తొలగించి అర్హులకు అందజేస్తామని తెలిపారు.

హరికిషన్ వివరణ : పింఛన్ మంజూరుపై టీఆర్‌ఎస్ నాయకుడు హరికిషన్‌ను వివరణ కోరగా తాను ఎలాంటి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోలేదని వివరణ ఇచ్చారు. తమది చేనేత సామాజిక వర్గం కాదని వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు