‘ఆసరా’ ఆందోళన

25 Nov, 2014 02:48 IST|Sakshi
‘ఆసరా’ ఆందోళన

వృద్ధుల కడుపు మండింది..
వికలాంగులు కన్నెర్ర జేశారు..
వితంతువులు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు..!
‘ఆసరా’ పింఛన్ జాబితాలో అర్హులను తొలగించి అనర్హులకు చోటు కల్పించడం వివాదాస్పదంగా మారింది. జాబితాలో తమ పేరు లేకపోవడంపై అర్హులు రోడ్డెక్కారు.. అధికారులను నిర్బంధించారు.. కుర్చీలను ధ్వంసం చేశారు..గ్రామసభలను బహిష్కరించారు..

- సాక్షి ప్రతినిధి, వరంగల్  

పింఛన్ రాలేదనే బెంగతో వృద్ధురాలి హఠాన్మరణం

స్టేషన్‌ఘన్‌పూర్ : పింఛన్ రాలేదని బెంగతో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడేనికి చెందిన గొడిశాల శేషమ ్మ(80) మృతిచెందింది. శేషమ్మకు గతంలో పింఛన్ వచ్చేది. సోమవారం ప్రకటించిన ఆసరా జాబితాలో పేరు లేదని ఆమెకు తెలిసింది.  తీవ్ర మనస్తాపానికి గురై హఠాత్తుగా కుప్పకూలి మృతిచెందింది.
 
ఇద్దరు అంధులను ఎలా సాదాలి దేవుడా...
కేసముద్రం : పెద్ద దిక్కులేని ఆ ఇంటిలో ఇద్దరు బిడ్డలు సామేల్, స్వప్న అంధులే. కేసముద్రం స్టేషన్‌కు చెందిన వారు. భర్త చనిపోగా, బిడ్డలకు నిత్యం దగ్గరుండి సాకుతూ వస్తోంది తల్లి రమ. కొత్తగా మంజూరైన పింఛన్ జాబితాలో తమ పేరు ఉందో.. లేదోనని ఉత్కంఠగా గ్రామసభకు వచ్చారు. ముగ్గురిలో తల్లి, కొడుకు పేరు లేదని తెలియడంతో అంధుడు సామేల్ స్పృహ తప్పి కుప్పకూలాడు. కొడుకు ముఖంపై నీళ్లు చల్లింది.  అంధులైన కొడుకు, కూతుర్ని పట్టుకుని.. ‘నా బిడ్డలను ఎలా సాదాలి దేవుడా’ అంటూ  కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.
 
స్టేషన్‌ఘన్‌పూర్ : వెంకటాద్రిపేటలో గీత కార్మిక పింఛన్ రద్దు చేయడంతో తాడగోని లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జఫర్‌గఢ్  మండలంలో పింఛన్ల జాబితాను చదువుతుండగా అడ్డుకుని చించేశారు.

మహబూబాబాద్ : వేమునూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో  గ్రామ అభ్యుదయ అధికారి రుద్రను, సిబ్బందిని లబ్ధిదారులు నిర్బంధించారు. బేతోలులో జాబితాలో పేర్లులేని అర్హులు కొందరు టెంట్లను చించివేసి కుర్చీలను ధ్వంసం చేశారు.

వర్ధన్నపేట : సర్వే చేసిన అధికారి వచ్చి జాబితా ప్రదర్శించాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ల్యాబర్తిలో గ్రామసభ జరగలేదు. రెడ్డిపాలెంలో సభను నిర్వహించకుండా అధికారులు వెనుదిరిగారు.

ములుగు : వెంకటాపూర్ మండల కేంద్రంలోని వికలాంగుడు రెడ్డి కోటయ్య పేరును అధికారులు వితంతువు పింఛన్ దారుల లిస్టులో ప్రకటించారు.

వరంగల్ తూర్పు : పింఛన్ల జాబితాలో రిటైర్డ్ తహసీల్దార్‌కు చోటుదక్కింది.వరంగల్ నగరంలోని 7వ డివిజన్ చింతల్ కుమ్మరివాడలో నగర పాలక సంస్థ ప్రదర్శించిన జాబితాలో ఆ పేరును చూసి స్థానికులు నివ్వెరపోయూరు. నిలదీయడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జాబితాలో పేరు తొలగించాలని రంగయ్య నుంచి దరఖాస్తు తీసుకున్నారు.
 
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు ఇచ్చే సామాజిక పింఛన్ల అర్హుల జాబితా వెల్లడి జిల్లావ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. అధికారులు సోమవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల అర్హులు, అనర్హులు, పరిశీలనలో ఉన్న వారి పేర్లను వేర్వేరుగా జాబితాలు పెట్టారు. ఇందులో అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు, ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు కొత్త జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై నిరసనకు దిగారు. జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆందోళనకు దిగారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తే..
 
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం : ఆసరా పింఛన్ల జాబితాల ప్రకటనపై నాలుగు మండలాల్లో వృద్ధులు, వితంతువులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పగూడెంలో అధికారులను సీపీఎం నాయకులు నిర్బంధిం చారు. పింఛన్ రాదేమోనని బెంగతో వృద్ధురాలు శేషమ్మ మృతిచెందింది. వెంకటాద్రిపేటలో గీత కార్మిక పింఛన్ రద్దు చేయడంతో లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు యత్నించా డు. రఘునాథపల్లి మండలంలో స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిం చారు. జఫర్‌గఢ్ మండలంలో పింఛన్ల జాబి తా చదువుతుండగా అడ్డుకుని చించేశారు.

మహబూబాబాద్ : పింఛన్ల కోసం 4,780 దరఖాస్తులు వచ్చాయి. 1,751 మందితో అర్హుల జాబితాను వెల్లడించారు. 1,764 పెండింగ్‌లో పెట్టారు. 1,265 అనర్హుల జాబి తాను తయారు చేశారు. అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంపై కమిషనర్ రాజ లింగును లబ్ధిదారులు నిలదీశారు. 23 వార్డు కౌన్సిలర్ బి.అజయ్ అర్హుల జాబితాను అధికారుల ఎదుటే చించివేసి నిరసన తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ ధర్నా నిర్వహించాయి. మహబూబాబాద్ మండలం వేమునూరు పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభ్యుదయ అధికారి రుద్రను, సిబ్బందిని లబ్ధిదారులు నిర్బంధించారు. బేతోలులో జాబితా లో పేర్లులేని అర్హులు కొందరు టెంట్లను చించి, కుర్చీలను ధ్వంసం చేశారు. కేసముద్రంలో పింఛను జాబితాలో పేరు లేకపోవడంతో సామెల్ సృ్పహ తప్పి పడిపోయాడు.

నర్సంపేట : పింఛన్లకు అర్హత ఉన్నా వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో అధికారుల ఎదు ట పలువురు నిరసన తెలిపారు. నర్సంపేట-వుల్లంపల్లి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చెన్నారావుపేట వుండలం బాపునగర్, గుర్రాలగండిరాజపల్లిలో  అధికారుల ను పంచాయుతీ కార్యాలయూల్లో నిర్బంధించారు. నెక్కొండ వుండల కేంద్రంలో ఎడ్ల సవ్ముక్క 90 శాతం అంగవైకల్యం కలిగినట్లు ఉన్నప్పటికి లీస్టులో పేరు లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూపాలపల్లి : గణపురం మండలం చెల్పూరులో జాబితలో తమ పేరు లేదని నిరసన తెలిపారు. శాయంపేట హుస్సేన్‌పల్లిలో గతంలో 67 మంది పింఛన్‌దారులు ఉన్నా రు. ప్రస్తుతం 27 మందికే పింఛన్లు మం జూ రు చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో అధికారులు నిర్బం ధించి తాళం వేశారు. పత్తిపాకలో ఎంపీడీఓ భద్రూనాయక్‌పై టీఆర్‌ఎస్ నేత దుబాసి క్రిష్ణమూర్తి, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎంపీడీఓపై ఒకరు చేయిచేసుకున్నట్లు తెలిసింది. చిట్యాల మండలం తిరుమలాపూర్, రామకిష్టాపూర్(టి), గర్మిళ్లపల్లి, జడల్‌పేట, నైన్‌పాక దాదాపు వేల మంది అర్హులకు పింఛన్లు మంజూరు కాకపోవడంతో గ్రామసభలను బహిష్కరించారు.

వర్ధన్నపేట : వర్ధన్నపేట మండలం ఇల్లందలో లబ్ధిదారులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. జాబితా తప్పుల తడకగా ఉం దని పెరుమళ్లగూడెంలో జాబితాను చింపివేసి గ్రామసభను అడ్డుకున్నారు. సర్వే చేసిన అధికారి వచ్చి జాబితా ప్రదర్శించాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ల్యాబర్తిలో గ్రామసభ జరగలేదు. రెడ్డిపాలెంలో సభను నిర్వహించకుండా అధికారులు వెనుదిరిగా రు. పర్వతగిరి మండలం అన్నారం అధికారులను, సిబ్బందిని పంచాయతీ కార్యాలయంలో నిరంచారు. హసన్‌పర్తి మండలం నాగారంలో వీఆర్వో లెనిన్‌పై లబ్ధిదారులు దాడికి ప్రయత్నించారు.

డోర్నకల్ : డోర్నకల్ మండలంలో 5,454 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించగా,  డోర్నకల్‌తోపాటుకురవి, గుండ్రాతి మడుగులో  తమకు పింఛన్ రాలేదంటూ మహిళలు అధికారులను నిలదీశారు.

జనగామ : జనగామ మండలం వడ్లకొం డలో పలువురు వృద్ధులు ఆందోళన చేపట్టారు.  చేర్యాల మండలంలో మండలంలోని ఆకునూరు, చుంచునకోటల్లో ధర్నాలు చేపట్టారు. మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట్ట మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

పరకాల : పరకాలలోని వెలుమవాడ, పద్మశాలివాడలో జరిగిన సభలో వితంతులు తమ పేర్లు రాక పోవడంతో నిరసన వ్యక్తం చేశారు. గీసుకొండ మండలంలోని ధర్మారంలో అధికారులు ఎవ్వరు రాకపోవడంతో గ్రామ సభను నిర్వహించలేదు.

పాలకుర్తి : తొర్రూరు, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లోని పలు గ్రామాల్లో పింఛన్లు పొందుతున్న ప్రస్తుత లబ్ధిదారుల పేర్లు తొలగించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరుప్పుల మండలం కడవెండిలో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు.

ములుగు : వెంకటాపూర్ మండల కేంద్రం లోని వికలాంగుడు రెడ్డి కోటయ్య పేరును అధికారులు వితంతువు పింఛన్ దారుల లిస్టులో ప్రకటించారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఆర్డీఓ మహేందర్‌జీని లబ్ధిదారులు నిలదీశారు. ఏటూరునాగారం మండలంలో జాబితాను తప్పులతడకగా ప్రకటించడంతో లబ్ధిదారులు.. నాయకులను, అధికారులను నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వరంగల్ తూర్పు : రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు   ఇంతకు ముందు పింఛన్‌లు తీసుకుని ఇప్పుడు లిస్ట్‌లో పేరురాని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.  అర్హత ధ్రువపత్రాలు సమర్పించినా మా పేర్లెందుకు లిస్ట్‌లో లేవని పలువురు మహిళలు తమ గోడు వినిపించారు.

వరంగల్ పశ్చిమ : ప్రస్తుతం అర్హులుగా ఉండి.. కొత్త జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ‘తెలంగాణ వస్తే తెలంగణ వస్తే మంచిగ బతుకుతం’ అని అనుకున్నామని.. రెండు వందల పెంఛనుకు బదులుగా రూ.1000 పెంచితే మాకు కడుపునిండ అన్నం దొరుకుతుందని ఆశపడ్డామని, రూ.200 కూడా రాకపోయే అని పలువురు పింఛన్‌దారులు అధికారులపై శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా అర్హులైన వారందరికి పింఛన్లు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు