పెద్దసారు లేక పరేషాన్!

15 Jul, 2014 04:41 IST|Sakshi
పెద్దసారు లేక పరేషాన్!

ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రాకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి వ చ్చిన ఫిర్యాదుదారులు అసహనానికి గురయ్యారు. తమ సమస్యకు పరిష్కారం పెద్దసా రు ద్వారానే లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. ప్రజావాణికి మొత్తం 130 వినతులు రాగా, డీఆర్వో రాజశేఖర్,కలెక్టరేట్ పరిపాలనాధికారి గంగాధర్ స్వీకరించారు.
 
సమస్యలు పరిష్కరించండి..
తమ సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్య మిత్రలు డీఆర్వోను కలిసి కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న తమను  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
 
ఇరాక్ బాధితులను ఆదుకోండి..
బతుకుదెరువు కోసం ఇరాక్‌కు వెళ్ళిఅరచేతిలో ప్రాణాలు పెట్టుకొని స్వదేశానికి ఉట్టి చేతులతో వచ్చిన బాధితులను ఆదుకోవాలని స్వదేశీ జాగరణ మంచ్ అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయ న బాధితులతో కలిసి డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు.  ఇరాక్ బాధితులను గుర్తించి,  ప్రభుత్వం నష్టపరిహారం లేదా ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు.
 
వికలాంగుల సమస్యలు పరిష్కరించండి..
జిల్లాలోని వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని మైత్రి వికలాంగుల సేవ సంస్థ ఆధ్వర్యంలో డీఆర్వోను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మైత్రి కార్యదర్శి రాణి మాట్లాడుతూ జిల్లాలో ఇంత వరకు సదరంలో 22వేల మంది వరకు వికలాంగత్వాన్ని ధ్రువీకరించుకున్నారని, కానీ అధికారులు  మా త్రం కేవలం నాలుగు వేల సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వికలాంగులు ఇటు కుటుంబాలకు, అటు సమాజానికి భారమై  నర కయాతన అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వం వికలాంగులందరికి సదరం సర్టిఫికెట్లు,అంత్యోదయం కార్డులు,గృహవసతి ,ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు, వివాహ ప్రోత్సాహాక బహుమతులు ఇవ్వాలని ఆమె కోరారు.
 
పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయండి
గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటి మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులతో  వెట్టి చాకిరి చేయిం చుకుంటూ తక్కువ వేతనాలు అందిస్తున్నారన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా  వేతనాలు అందించాలన్నా రు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, వెంటనే అమలుచేయాలని కోరారు.

మరిన్ని వార్తలు