ప్రియురాలికి మరొకరికితో పెళ్లి నిశ్చయమైందని..

3 Jul, 2019 09:00 IST|Sakshi
నరేష్‌కుమార్‌గౌడ్‌ మృతదేహం

పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

సాక్షి, శాంతినగర్‌ (అలంపూర్‌): తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కలుకుంట్లలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కలుకుంట్లకి చెందిన నరేష్‌కుమార్‌గౌడ్‌ (28) వనపర్తిలో ఐదేళ్లక్రితం పాల డెయిరీ నడిపేవాడు.

వనపర్తిలో అప్పట్లో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం అతను కర్నూలులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, ఇటీవల తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలుసుకొని మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం కలుకుంట్లలోని సొంత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి అన్న ప్రేమ్‌కుమార్‌గౌడ్‌ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు