రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్‌ వాసి మృతి

19 Oct, 2019 12:37 IST|Sakshi
అంజుమ్‌ఖాన్‌ మృతదేహం, పక్కన ద్విచక్రవాహనం

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న బైక్‌ 

నర్సాపూర్‌పెద్దతండా, పట్లూర్‌ మధ్య ఘటన

సాక్షి, మర్పల్లి: బతుకు దెరువుకోసం వచ్చిన ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నర్సాపూర్‌ పెద్దతండా, పట్లూర్‌ గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా జార్‌క్లా గ్రామానికి చెందిన అంజుమ్‌ఖాన్‌ (32) నర్సాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద మూడేళ్లుగా జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల బక్రీద్‌ పండగ కోసం ఇంటి వెళ్లివచ్చాడు.

తిరిగి రెండు నెలల క్రితం ఇక్కడకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లో నమాజ్‌ చేసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కంకర మిషన్‌ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న 11 కేవీ విద్యుత్‌ స్తంభానికి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అంజుమ్‌ ఖాన్‌ తల కు మతమైన గాయాలయ్యాయి. మర్పల్లి జెడ్పీటీసీ పబ్బె మధుకర్, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మర్పల్లి ఏఎస్‌ఐ కె.మోహన్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మర్పల్లి  ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు 6గురు సంతానం ఉన్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు