ప్రాణం తీసిన మూఢనమ్మకాలు

9 Dec, 2019 10:35 IST|Sakshi

సాక్షి, బంట్వారం: తల్లిదండ్రుల మూఢ నమ్మకాలతో సకాలంలో వైద్యం అందక ఓ ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం బంట్వారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బంట్వారం గ్రామానికి చెందిన గుడాటి సతీష్‌రెడ్డి (22) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల్లో స్వగ్రామానికి వెళ్లిన సతీశ్‌రెడ్డి బైక్‌పై నుంచి కింద పడడంతో వెన్నముక దెబ్బతింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నెలరోజుల పాటు మాంత్రికుల వద్దకు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో వెన్నుపోటు తగ్గకపోగా మరింత తీవ్రమైంది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ అస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని మరో ఆస్పత్రికి వెళ్లారు. వారం రోజులుగా చికిత్స పొంది వైద్యులు డిశ్చార్జి చేశారు. కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సతీశ్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రామిరెడ్డి, సక్కమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.   

మరిన్ని వార్తలు