ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి; మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

2 Jun, 2020 12:07 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ భర్త అశోక్‌ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటనలో అంగన్‌వాడీ ఆయా కలవ్వకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రంలో ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్పందించిన మంత్రి హరీష్‌‌ రావు
కాగా.. దొమ్మట ఘటనపై స్పందించిన మంత్రి హరీష్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మృతుడి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయాన్నిప్రకటించిన మంత్రి.. అశోక్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కలవ్వను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చదవండి: ‘కింగ్‌కోఠి’లో 19 మందికి పాజిటివ్‌ 

మరిన్ని వార్తలు