సాక్షి, చిట్యాల : అందుబాటులోని పాత స్కూటర్ ఇంజిన్, ఇతర విడి భాగాలను సేకరించిన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ రాచకొండ లింగస్వామి పత్తి చేలలో గుంటుక తీసేందుకు ఉపయోగించే యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రంతో లీటర్ పెట్రోల్తో ఎకరం భూమిలో గుంటుక తీసే పనులు చేస్తున్నాడు. దీంతో అతి తక్కువ ఖర్చుతో పెద్దగా శ్రమ లేకుండా పత్తి చేలలో గుంటుకలు తీయడం సులవుతుందని ఆయన పేర్కొంటున్నాడు. ప్రస్తుతానికి తనకి వ్యవసాయం ఉన్నప్పటికీ సాగుబడి చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయన తన స్నేహితుడు గాదరి లింగస్వామి కోరిక మేరకు ఈ గుంటుక యంత్రాన్ని తయారు చేసినట్లు ఆయన వివరించారు.