అప్పులు తీర్చాలని విదేశాలకు వెళ్లాడు కానీ..

14 Feb, 2020 13:07 IST|Sakshi

సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఒమన్‌ దేశంలో ఈ నెల 4న గుండెపోటుతో మృతి చెందిన యువకుడి మృతదేహం గురువారం స్వగ్రామం చేరింది. వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన బత్తుల లక్ష్మీ–రాజయ్య దంపతులకు సతీష్, సుమలత, సుజాత సంతానం. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో కుటుంబ పోషణ భారం సతీష్‌(29)పై పడింది. రూ.5 లక్షలు అప్పు చేసి పెద్ద చెల్లెలు సుమలతకు పెండ్లి చేశాడు. రెండేళ్ల క్రితం రూ.2లక్షలు అప్పు చేసి గల్ఫ్‌ వెళ్లాడు.

అక్కడికి వెళ్లిన  ఏడాదిన్నర పాటు పనులు చేయగా ఆరునెలల క్రితం అనారోగ్యానికి గుర రైయ్యాడు. చర్మవ్యాధితో బాధపడుతూ గల్ఫ్‌లో చికిత్స పొందుతున్నాడు. అప్పులు తీర్చలేక, స్వగ్రామానికి రాలేక, మానసికంగా కుంగిపోయిన సతీష్‌ రెండునెలలుగా రూంలోనే ఒంటరిగా ఉంటూ కాలం గడిపాడు. చర్మవ్యాధి తీవ్రరూపం దాల్చడం, అప్పులతో మానసిక వేదనకు లోనయ్యాడు. ఈ నెల 4న రూంలోనే గుండెనొప్పి రావడంతో మిత్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడి మిత్రులు చందాలు పోగుచేసి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. శవపేటిక గ్రామానికి రాగానే బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.  

మరిన్ని వార్తలు