నకిలీ పోలీసులు ఎక్కడ ?

12 Jan, 2020 11:06 IST|Sakshi
లక్సెట్టిపేటలో సీఐడీ పోలీసులమని బెదిరించిన నకిలీలు

 పోలీసుల పేరిట వసూళ్లు

యథేచ్ఛగా సెటిల్‌మెంట్లు, దందాలు

తాజాగా జిల్లా కేంద్రంలో మరో ఘటన

రంగంలోకి పోలీసులు...వారం గడిచినా దొరకని వైనం

సాక్షి, మంచిర్యాల: పోలీసులమని చెప్పుకుంటూ... అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని ఓ నకిలీ పోలీసుల ముఠా జిల్లాలో అక్రమ దందాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. పోలీసులమని, పోలీస్‌ ఉన్నాతాధికారుల వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నామని చెబుతూ సెటిల్‌మెంట్లు, దోపిడీలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సంఘటనలు జిల్లాలో సంచలనం కలిగిస్తున్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ ముందు ఖాకీ ముసుగు వేసుకున్న ఓ నకిలీ పోలీసుల ముఠా దోపిడీ వెలుగులోకి వచ్చింది.  గతంలోనూ జిల్లాలో పోలీసులమని చెప్పి అక్రమ వసూళ్లకు, దాడులకు దిగబడిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. 

జిల్లాలో సంచలనం...
జిల్లాలో నకిలీ పోలీసుల ముఠా తాజాగా వెలుగులోకి రావడంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. గత కొంత కాలంగా జిల్లాలో ఓ నకిలీ పోలీసుల ముఠా అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లు, అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ వద్ద ఈ నెల 5న మధ్యప్రదేశ్‌కు చెందిన ఖాయ్‌ఖాన్, హైదరాబాద్‌కు చెందిన సురేష్‌ అనే మేకల వ్యాపారుల వద్ద పోలీసులమని చెప్పి రూ.9.50ల„ý లతో ఉడాయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా పోలీస్‌ యంత్రంగా అప్రమత్తమైంది. ఈ నకిలీ పోలీసుల ముఠాకు పోలీస్‌ శాఖలో కొందరు సహకారిస్తున్నారన్న ఆరోపనలు సైతం వినిపిస్తున్నాయి. 

ఇన్‌ఫార్మర్లది అదే దందా...
రహస్య సమాచారం కోసం పోలీస్‌ అధికారులు ఎక్కడైన ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను అనాధికారికంగా వినియోగించుకుంటారు. దీంతో పోలీసులకు సమాచారం ఇస్తున్నామని పోలీస్‌ అధికారులతో ఫైరవీలు చేసుకోవడం, అక్రమదందాలు కొనసాగించడం, సెటిల్‌మెంట్లు, అక్రమ దందాలు గుట్కా, బెల్టుషాపు, స్క్రాప్‌ దందా, ఇసుక దందా, మట్టి దందా నిర్వహిస్తున్న వారి వద్ద పోలీసుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడడం లాంటి దందాల్లో ఇన్‌ఫార్మర్లు, నకిలీ పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపనలు ఉన్నాయి. 

రంగంలోకి ఇంటెలిజెన్స్‌ వర్గాలు...
ఈ నెల 5న జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న నకిలీ పోలీసుల ఘటన పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వారం రోజులుగా వెతుకుతున్న నకిలీ పోలీసుల ముఠా ఆచూకీ లభించలేదు. దీంతో ఇంటలిజెన్స్, స్పెషల్‌ పార్టీ బృందాలు రంగంలోకి దిగాయి.

జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు..
2017 జనవరిలో జిల్లాలోని లక్సెట్టిపేట మండల కేంద్రంలోని ఓ రిటైర్డ్‌ టీచర్‌ రూ.1లక్ష బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు వెళ్తుండగా అతన్ని మధ్యలో అడ్డుకుని ఇద్దరు వ్యక్తులు సీఐడీ పోలీసులమని చెప్పి బెదిరించారు. నోట్టు మార్పిడి చేస్తున్నారని సదరు వ్యక్తిని బెదరించారు. అతని బ్యాగులోని లక్ష రూపాయలను పట్టుకుని పరారయ్యారు. ఆదే రోజు మరో ఇద్దరు  వ్యక్తులు పోలీసులమని చెప్పి హాజీపూర్‌ మండలం రాపల్లి గ్రామంలో ఓ ల్యాండ్‌ సెటిల్‌ మెంట్‌ చేస్తామని చెప్పి ఓ రియల్టర్‌ వద్ద నుంచి రూ. 50వేలు కాజేశారు.

రామకృష్ణపూర్‌ ప్రాంతానికి చందిన ఓ సింగరేణి కార్మికుడికి ల్యాండ్‌సెటిల్‌ మెంట్‌ చేస్తామని చెప్పి రూ. 60వేలు తీసుకుని పారిపోయారు. దీంతో నకిలీ పోలీసుల ముఠా వెలుగు చూసింది. ఎట్టకేలకు వారిని పట్టుకొని కటకటాల్లోకి పంపించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కోసిని గ్రామ శివారులోని రాజేశ్వర రైస్‌మిల్‌పై 14మంది ఆర్మీ డ్రెస్‌లో వచ్చి సినీ ఫక్కిలో రైస్‌మిల్‌పై దాడి చేశారు. రైస్‌మిల్‌ యజమానిని బెదరించి రూ.16.30 లక్షలు దోచుకుని క్షణాల్లో మాయమైన  సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 

>
మరిన్ని వార్తలు