రోడ్లకు అడ్డంగా కట్టేస్తున్నారు..!

11 Oct, 2018 17:43 IST|Sakshi

రోడ్లపై ప్రార్థనా మందిరాలపై హైకోర్టులో పిటిషన్‌

కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రార్ధనా మందిరాలు తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రార్థనా మందిరాలతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ మామిడి వేణుమాధవ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అక్రమంగా నిర్మించిన ప్రార్ధనా మందిరాలు కొందరికి  వ్యాపార కేంద్రాలుగా మారాయనీ, ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు.

అనుమతిలేని ఆలయాలను తొలగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలిచ్చిందని వేణుమాదవ్‌ కోర్టుకు విన్నవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలో 2010లో ఈ విషయమై పాలసీ తయారీకి, ఇంప్లిమెంటేషన్‌కు ప్రభుత్వం 262, 263 జీవోలు సైతం తెచ్చిందని పిటిషనర్‌ అన్నారు. అనుమతులు లేని ప్రార్థనాలయాల తొలగింపుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు వేసినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. 

తొలగించాం..
పిటిషన్‌ను విచారించిన కోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోర్టు వివరణ కోరింది. 2013లో 150 అనుమతిలేని ప్రార్థనాలయాలను తొలగించామని ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం కౌంటర్‌లో నిజం లేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. కాగా, కౌంటర్ దాఖలు చెయ్యని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. హైకోర్టు సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.

మరిన్ని వార్తలు