బాత్‌రూంలో జారిపడి ఫార్మసీ విద్యార్థి మృతి

7 Dec, 2015 18:14 IST|Sakshi

చిన్నకోడూరు (మెదక్) : మరుగుదొడ్డిలో కాలు జారి పడి ఎం.ఫార్మసీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం గుర్రాలగొందిలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు ... గ్రామానికి చెందిన కొడిసెల్ల యాదగిరి, నర్సవ్వ దంపతుల కుమారుడు సతీష్(23) ఎం.ఫార్మసీ సెకండియర్ చదువుతున్నాడు. కాగా సతీష్‌కు ఆదివారం గుండె నొప్పి రావడంతో సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె సంబంధిత సమస్య లేదని చెప్పారు.

సోమవారం ఉదయం సతీష్ ఇంట్లో మరుగుదొడ్డికి వెళ్లాడు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లోపల సతీష్ కిందపడిపోయి ఉన్నాడు. అప్పటికే అతడు మృతిచెందాడు. మరుగు దొడ్డిలో పడిపోవటంతో సతీష్ తలకు బలమైన గాయాలయ్యాయి. అయితే, మరుగు దొడ్డిలో పడి బలమైన గాయాలతో సతీష్ చనిపోయాడా?  లేక గుండెపోటుతో మృతి చెందాడా? అనేది తేలాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు