విద్యార్థులపై ఫీ‘జులుం’

24 Jan, 2015 03:47 IST|Sakshi
విద్యార్థులపై ఫీ‘జులుం’

శాతవాహన యూనివర్సిటీ: డిగ్రీ విద్యార్థుల నుంచి ఇంటర్నల్ పరీక్షల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 200 వసూలు చేస్తున్నారని.. దానిని వెంటనే నిలిపి వేయాలని, గతంలో విద్యార్థుల నుంచి తీసుకున్న ఫీజులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నగర సంటన్ కార్యదర్శి సందీప్, జిల్లా కో కన్వీనర్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో కరీంన గర్ శాణినికేతన్ కళాశాలలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలో దాదాపు 125 డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మంచి మార్కులు వేయాలంటే ఒక్కో విద్యార్థి కచ్చితంగా రూ. 200 చెల్లించాలని వాణినికేతన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం నిబంధనలు పెట్టింది. అంతేకాదు కళాశాల వార్షిక ఫీజు విషయమై కళాశాల యాజమాన్యం ఓ నిర్ణీత నమూన లెటర్‌పై రెవెన్యూ స్టాంప్ అతికించి మరీ విద్యార్థులతో బప్పంద పత్రాలు రాయించింది. విషయం ఏబీవీపీ నాయకులకు తెలియడంతో రుసుం వసూలు చేయడం సరికాదని ఆందోళన చేపట్టారు.
 
అన్ని కళాశాలల్లో ఇదే తీరు..
శాతవాహన పరిధిలో అన్ని డిగ్రీ కళాశాలలో ఇదే తతంగం నడుస్తోందని వాణినికేతన్ కళాశాల ఏవో సరోజ మీడియా ఎదుట బేషరుతుగా వెల్లడించారు. రుసుం వసూలుకు నిబంధనలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ఇంటర్నల్స్‌కు ఖర్చులుంటాయని వివరించారు.

విద్యార్థుల నుంచి కొంత ఫీజు తీసుకోవాలని వర్సిటీ అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చారన్నారు. కావాలంటే దానిని నాలుగైదు గంటల్లో నిరూపిస్తానన్నాని చెప్పారు. జిల్లాలోని దాదాపు 125 కళాశాలలో ఏలాంటి ఆధారాలు లేకుండా వసూలు జరుగుతుంటే మేం మాత్రమే తీసుకున్న దానికి ర శీదులాగా పేపర్స్ ఇచ్చామని అన్నారు.
 
ఫీజు తిరిగి చెల్లిస్తాం..
విద్యార్థుల నుంచి తీసుకున్న రూ. 200 తిరిగి చెల్లిస్తాం. అందరిని పరీక్షలకు హాజరుకు అనుమతిస్తాం.  వార్షిక ఫీజు విషయంలో విద్యార్థులకు భయం ఉండాలన్న కోణంలో రెవెన్యూ స్టాంప్‌పై సంతకాలు చేయించాం. దాంతో మేము ఏమీ చేయం. విద్యార్థులు గమనించాలి
 - సరోజ, ఏవో, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, కరీంనగర్
 
ఫీజులు తీసుకోవాలని చెప్పలేదు
ఇంటర్నల్స్ పరీక్షల గురించి ఫీజు తీసుకోవాలని ఏ కళాశాలకు చెప్పలేదు. కళాశాలలో పరిస్థితి తిరగబడితే వర్సిటీపై నెట్టడం సరికాదు. ప్రమాణాలు మెరుగు పర్చే క్రమంలో ఇంటర్నల్స్ పరీక్షలకు సంబంధించిన పేపర్స్ వర్సిటీకి ఇవ్వాలన్న నిబంధన  తెచ్చాం. ఫీజు విషయంలో వర్సిటీ ప్రమేయం లేదు.         
- దాస్యం సేనాధిపతి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి

మరిన్ని వార్తలు