న్యాయవాదుల ఫండ్‌పై పిటిషన్‌ దాఖలు

12 May, 2020 13:15 IST|Sakshi

గతంలో కేటాయించిన రూ.100 కోట్లుకు వడ్డీని చెల్లించాలని పిల్‌

సాక్షి, హైదరాబాద్‌ : న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన రూ. 100 కోట్లు ఫండ్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లకు వచ్చిన వడ్డీని న్యాయవాదులకు అందించాలని అడ్వకేట్‌ రాపోలు భాస్కర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. పిటినర్‌ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపిస్తూ.. లాక్‌డౌన్‌ కారణంగా న్యాయవాదులు కేసులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో కేటాయించిన రూ.100 కోట్ల ఫండ్‌కు వచ్చిన వడ్డీని కరోనా కష్ట కాలంలో న్యాయవాదులకు ఇచ్చి వారిని  ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసిందని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పిటిషనర్‌ స్పందిస్తూ.. తాజాగా కేటాయించిన 25 కోట్ల గురించి తాము అడగడం లేదని, గతంలో ఇచ్చిన 100 కోట్ల న్యాయవాదుల ఫండ్ గురించి అడుగుతున్నామని వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. అలాగే రూ. 25 కోట్లు ఏ ప్రాతిపదికన న్యాయవాదులకు ఇస్తున్నారో రేపటిలోగా (బుధవారం) తెలపాలని ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. (అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకండి)

జర్నలిస్ట్‌లను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్‌

మరిన్ని వార్తలు