యువ పారిశ్రామికవేత్తలకు అండ: కేటీఆర్‌ 

29 Nov, 2019 04:47 IST|Sakshi

కాచిగూడ: యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సీఎం ఎస్టీ ఎంటర్‌పెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్‌ స్కీమ్‌లో భాగంగా హిమాయత్‌నగర్‌లో మహిళా పారిశ్రామికవేత్త గౌతమి ఏర్పాటు చేసిన ‘చీసీయానో పిజ్జా’సెంటర్‌ను గురువారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘నేనే స్వయంగా వచ్చి షాప్‌ ప్రారంభిస్తానని ఈ నెల తొలివారంలో గౌతమికి మాటిచ్చాను.

అందులో భాగంగానే ఈరోజు షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చాను’అని తెలిపారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేసి ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. గిరిజన ఆడబిడ్డలకు హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహకం ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన బిడ్డ ఇక్కడ పిజ్జా షాప్‌ ఓపెన్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

హిమాయత్‌ నగర్‌లో పిజ్జా సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌ 

మరిన్ని వార్తలు