సిటీలో దశలవారీగా నిషేధం అమలు
తొలుత అవగాహన, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఆ తర్వాతే కఠిన చర్యలు
ముంబై అనుభవాలతో జీహెచ్ంఎసీ చర్యలు
ప్లాస్టిక్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రేటర్ కమిషనర్ ట్వీట్
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణానికి పెను సవాలుగా మారిన ‘ప్లాస్టిక్’ వినియోగాన్ని గ్రేటర్లో దశలవారీగా నిషేధించనున్నారు. మైక్రాన్లతో నిమిత్తం లేకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ప్లాస్టిక్ నిషేధానికి తీర్మానం చేశారు. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తామని మంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో ప్లాస్టిక్ నిషేధంపై చిరువ్యాపారుల నుంచి, ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలనుపరిగణనలోకి తీసుకున్న గ్రేటర్ అధికారులు ఇక్కడ దశలవారీగా నిషేధ యజ్ఞాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించారు.
అవి ఉత్పత్తి చేసే వారిపైనా, వినియోగించే వ్యాపారులపైనా చర్యలు తీసుకుంటున్నారు. దశలవారీగా మిగతా ప్లాస్టిక్స్ను నిషేధించాలని, వివిధ వర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ముమ్మర ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫంక్షన్హాళ్లు, కల్యాణ మండపాలు వంటి ప్రాంతాల్లో వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పుల స్థానే స్టీల్, పింగాణీ, గాజువి వాడేలా అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఇంటిల్లిపాదీ ఆచరించేలా చేస్తారనే తలంపుతో పది లక్షల మంది విద్యార్థులకు ఈ సంవత్సరం అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. బస్తీల్లోని స్వయం సహాయక మహిళా బృందాల ద్వారా ప్రతి ఇంటికీ ప్రచారం చేయానున్నారు. ఓవైపు ప్రచారం నిర్వహిస్తూ.. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వస్తువుల కొనుగోలుకు టిఫిన్ బాక్సులు, జూట్, క్లాత్ బ్యాగులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రాథమికంగా ఈ కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టినప్పటికీ, మరింత ముమ్మరం చేయనున్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు లేని పక్షంలో నిషేధం సాధ్యం కాదని ముంబై అనుభవం నిరూపించడంతో ఆదిశగానూ పకడ్బందీ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు.
ముంబైలో ఏం జరుగుతోందంటే..
ముంబై మహానగరంలో మార్చి నెలలో ప్లాస్టిక్ నిషేధం ప్రకటన జారీ చేసి ఈనెల 23 నుంచి అమల్లోకి తెచ్చారు. దుకాణాలు, సంస్థలపై భారీగా దాడులు చేస్తూ పెనాల్టీలు విధించారు. నిషేధంపై ప్రజలకు తగిన అవగాహన కల్పించలేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తేలేదు. బ్రాండెడ్ కంపెనీలు చిప్స్కు వినియోగించే ప్లాస్టిక్ కవర్లను మాత్రం అనుమతిస్తూ.. సామాన్య ప్రజలకు అవసరమైన పప్పులు, బియ్యం, చక్కెర వంటివాటికి వినియోగించే ప్లాస్టిక్స్ క్యారీ బ్యాగుల్ని నిషేధించడంతో వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈనేపథ్యంలో రిటైల్ సరుకుల ప్యాకింగ్స్కు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. తిరిగి వాటిని రీసైకిల్, రీయూజ్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే చర్యలకు సిద్ధమైంది. ప్లాస్టిక్ నిషేధం వల్ల తలెత్తే పరిస్థితుల్ని అంచనా వేయకపోవడం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమవడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో తొలుత ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి.. దశలవారీగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది.
ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా..
దశలవారీగా ముందుకెళ్తాం..
ప్లాస్టిక్స్ ఎంత ప్రమాదకరమో, పర్యావరణానికి ఎంత హానికరమో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే అందరూ నిషేధాన్ని పాటిస్తారు. ప్రజలకు అర్థమయ్యేందుకు ఒక్కో నెల ఒక్కో అంశంపై నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. ఉదాహరణకు ఒక నెలంతా ప్టాస్టిక్ గ్లాసులు వాడరాదని ప్రచారం చేసి ప్రత్యామ్నాయాలను చూపిస్తాం. అందుకు ప్లాస్టిక్ గ్లాసెస్ నిషేధ మాసంగా పరిగణిస్తాం. మరో నెల కప్పుల మాసం.. ఇంకో మాసం కట్లెరీ మాసంగా ప్రచారం చేస్తాం. తద్వారా ప్రజల్లో వాటిని వాడరాదని బలంగా నాటుకుంటుంది. ఉత్పత్తిదారులకూ నిషేధంపై అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే మాంసానికి టిఫిన్ బాక్సులు వాడేలా చేసిన ప్రచారం మంచి ఫలితాలిచ్చింది. 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తాం. – డా.బి.జనార్దన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్
ప్రత్యామ్నాయాలు లేకుండా అసాధ్యం
నిత్యావసరంగా మారిన ప్లాస్టిక్ను ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా నిషేధించడం సాధ్యం కాదు. అన్ని ప్లాస్టిక్స్ వల్లా హాని ఉండదు. రీసైకిల్ చేయగలిగే వాటిని వినియోగించవచ్చు. తగిన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తెచ్చి నిషేధించవచ్చు. ఉత్పత్తి చేసిన కంపెనీ తిరిగి వాటిని సేకరించి, రీసైక్లింగ్కు పంపించే ఏర్పాట్లు చేయాలి. ఉన్నపళంగా ప్లాస్టిక్ను నిషేధిస్తే వాటిపై ఆధారపడ్డ చిరువ్యాపారులు, ర్యాగ్పిక్కర్స్ జీవనోపాధి దెబ్బతింటుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా నిషేధించాలి. – అనిల్కుమార్, ఆలిండియా ప్లాస్టిక్ఉత్పత్తిదారుల సంఘం (సౌత్) ఉపాధ్యక్షుడు