గరం..గరం చాయ్‌; గాజు గ్లాస్‌లోనే తాగేయ్‌..

22 Sep, 2019 12:26 IST|Sakshi

టీ స్టాల్స్‌లో గాజు గ్లాసులపై మోజు

నిషేధిత ప్లాస్టిక్, పేపర్‌గ్లాస్‌లకు గుడ్‌బై

పర్యావరణ పరిరక్షణలో నగరవాసులు

సాక్షి, నిజామాబాద్‌: ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వం ప్లాస్టిక్‌ వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో అంతంత మాత్రమే శ్రద్ధ కనబరుస్తుందనే విమర్శలు 
వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ప్రజల్లోనే ప్లాస్టిక్‌ వాడకం వల్ల జరిగే అనార్ధాలు, రోగాలు సామాజిక మాధ్యమాలలో తెలుసుకొని ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నయంగా జ్యూట్‌ బ్యాగులను, టీని ప్రమాదకరమైన పేపర్‌గ్లాస్‌లకు బదులుగా గాజుతో తయారైన గాజు గ్లాస్‌లో తాగడంపై మోజు చూపుతున్నారు.

పరిస్థితి మారుతోంది..  
అయితే ఇప్పుడిప్పుడే ప్రజల్లో ప్లాస్టిక్‌ వాడవద్దని అవగాహణ వస్తోంది. ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయంగా జూట్‌బ్యాగ్‌లను వాడుతున్నారు. అలాగే చాయ్‌ తాగడంలోనూ ప్లాస్టిక్‌ కప్పులు, ప్రమాదకరంగా తయారైన పేపర్‌కప్పులను వాడడం లేదు. అచ్చంగా గాజు గ్లాసుల్లోనే తాగుతున్నారు. నగరంలోని టీ స్టాల్స్‌లోనైతే కొద్దిరోజుల నుంచి ప్లాస్టిక్‌ కవర్లలో టీ తాగడానికి ప్రజలు అనాసక్తి కనబరుస్తున్నారు. గాజు గ్లాసులోనే టీ తాగడంపై మోజు పెంచుకుంటున్నారు. పొరపాటును ప్లాస్టిక్‌ కవర్లలో టీ ఇస్తే కస్టమర్లు తిరస్కరిస్తున్నారని, టీ స్టాల్స్‌ వ్యాపారులు పేర్కొంటున్నారు.

గాజు గ్లాసుల్లోనే తాగుతున్నారు
కొన్ని నెలల నుంచి ప్లాస్టిక్‌ కవర్లలో టీ తాగడానికి ప్ర జలు నిరాసక్తత చూపుతున్నారు. నాలుగు దశాబ్దాలకుపైనే తన తండ్రి బడాబజార్‌లో హోటల్‌ నడిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తండ్రి మరణాంతరం తాను టీ స్టాల్‌ను కొనసాగిస్తున్నాను.అప్పట్లో గా జు గ్లాసులు తప్ప వేరేవి లేనే లేవు. దశాబ్దకాలం నుంచే ప్లాస్టిక్‌ గ్లాసులు ఎక్కువయ్యా యి. మళ్లీ పాత రోజులు వచ్చాయి. గాజు గ్లాసులలోనే టీ తాగడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. తమ హోటల్‌ వద్దకు వచ్చిన కస్టమర్లే కాకుండా పార్సల్‌కు తీసుకువెళ్లే దుకాణాదారులు కూడా టీ తాగి వెళ్తున్నారు. కాని కవర్లలో తీసుకెళ్లట్లేదు.

ఇతరులను చైతన్యపరుస్తున్నాను 
ప్లాస్టిక్‌ కవర్లు వాడవద్దని చెప్పుతున్న ప్రభుత్వాలు మొదట ప్లాస్టిక్‌ బడా కంపెనీలను మూసివేస్తే ప్లాస్టిక్‌ కవర్లు అనేవే బయటకు రావు. బడా కంపెనీల నుంచి లంచాలు తీసుకొని ప్లాస్టిక్‌ తయారీ కంపెనీలకు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వానికి పరిపాటే. మళ్లీ ప్లాస్టిక్‌ కవర్లను వాడవద్దని అధికారులతో చెప్పించడం ప్రజలను పిచ్చోళ్లను చేయడమే. నేను మాత్రం ఉదయం,సాయంత్రం రాము టీ స్టాల్‌లో రెండుసార్లు గాజు గ్లాసులోనే టీ తాగుతాను.
- ఈశ్వర్, కస్టమర్, బడాబజార్‌

మరిన్ని వార్తలు