హైదరాబాద్ వాసుల ఇబ్బందులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సాక్షి టీవీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిక్కుకుపోయిన తెలుగువారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఢిల్లీలోని ఏరోసిటీలో క్వారంటైన్ పూర్తయి, నెగెటివ్ వచ్చిన వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు పాసులు జారీ చేశారు. కాగా హైదరాబాద్కు చెందిన పీఎన్ రావు కుటుంబం మార్చి 22న అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటి నుంచి ఏప్రిల్ 5 వరకు వారి కుంటుంబమంతా క్వారంటైన్లోనే ఉన్నారు. వారం కిందట క్వారంటైన్ పూర్తి కావడంతో హైదరాబాద్కు వచ్చేందుకు ప్రయతిస్తూ.. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెళ్లేందుకు సహాయం చేయాలని సాక్షి టీవీ ద్వారా కోరారు.
ఢిల్లీలో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను సాక్షి టీవీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర హోం మంత్రి శాఖ కార్యాలయం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు పాసులు జారీ చేసే ఏర్పాట్లు చేసింది. క్వారెంటైన్ పూర్తయిన వారిని స్వస్థలాలకు పంపుతామని తెలిపింది. ఈ ప్రకటనతో వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కిషన్ రెడ్డికి, సాక్షి టీవీకి హైదరాబాద్ వాసులు ధన్యవాదాలు తెలిపారు.