నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...

7 Sep, 2019 13:16 IST|Sakshi

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సత్యసంగీత ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో పలువురు కళాకారులకు, తెలుగు మూవీ, ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ సభ్యులకు కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంచి ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు టీవీ సీరియళ్లలో నటిస్తున్నారని, అందువల్లే తాను కూడా నిత్యం టీవీ సీరియళ్లు చూస్తున్నానని చెప్పారు.

రాజకీయ నాయకులకు కొంత ఒత్తిడి ఉంటుందని, ఇటువంటి, సీరియళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే ఒత్తిడి తగ్గుతుందన్నారు. అనంతరం  నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి, సీనియర్‌ ఎన్‌టీఆర్‌ డూప్‌ భాస్కర్‌ ప్రదర్శనలు  ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక మండలి చైర్మన్‌ దేవర మల్లప్ప, సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి.శివకుమార్, సినీ నటుడు రఘుబాబు, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ఎండీ బండారు సుబ్బారావు, సత్యసంగీత ఇంటర్నేషనల్‌ సంస్థ అధ్యక్షుడు ఓంకార్‌ రాజ్, తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు ఎం.బి కృష్ణాయాదవ్, సుబ్బరాయశర్మ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు