రాజకీయమంటే వ్యాపారం కాదు

27 Aug, 2019 11:27 IST|Sakshi

నాయకులు స్వప్రయోజనాల కోసం పాకులాడొద్దు

ప్రజా సేవే పరమార్థంగా పని చేయాలి

శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, నస్రుల్లాబాద్‌: రాజకీయమంటే వ్యాపారం కాదని, రాజకీయ నాయకులు ప్రజా సేవే పరమార్థంగా పని చేయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ప్రతి నాయకుడు ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని, స్వప్రయోజనాల కోసం ఆలోచించుకోవడం మానుకోవాలన్నారు. మండలంలోని అంకోల్‌ క్యాంపు గ్రామంలో నిర్మించిన 31 డబుల్‌ బెడ్రూం ఇళ్లను సభాపతి పోచారం సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌ అంటే గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సమస్య పరిష్కారానికి ముందు ఉండాలన్నారు. కొంత మంది రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుంటున్నారని, అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ప్రతి వ్యక్తికి తోడు, నీడ ఉండాలని.. తోడు మీరు(ప్రజలు) చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నీడను అందించాలన్న ఉద్దేశ్యంతో డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తుందని చెప్పారు. నిరుపేదలకు గతంలో ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షలు ఇచ్చి పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఇప్పటికి 5 వేల ఇళ్లను కేటాయించామని, వీటిలో 2500 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని లబ్ధిదారులను ఎంపిక చేసి అందివ్వడమే మిగిలిందని చెప్పారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌ దఫేదార్‌ శోభ, జెడ్పీటీసీ జన్నుబాయి, ఎంపీపీ విఠల్, జిల్లా కో–ఆప్షన్‌ మెంబర్‌ మాజీద్‌ ఖాన్, తహసీల్దార్‌ అర్చన, డీఎఫ్‌వో వసంత, వైస్‌ ఎంపిపి ప్రభాకర్‌రెడ్డి, ఎంపిటిసి మేని బాయి, మాజి ఏఎంసీ చైర్మన్‌ పెర్క శ్రీనివాస్, రాము, అయ్యన్న,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

నస్రుల్లాబాద్‌: మండలంలోని దుర్కి శివారులోని సోమలింగేశ్వరాలయం దినదినాభివృద్ధి చెందుతూ దక్షిణ కాశీగా విరాజిల్లుతోందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో స్పీకర్‌ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కల్యాణ మండపంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని బోర్లంలో గల బసవేశ్వర మందిరం, వర్ని మండలంలోని బడాపహాడ్‌తో పాటు సోమలింగేశ్వరాలయంలో చేపట్టిన కల్యాణ మండపాల నిర్మాణాలు నిధులు లేక నిలిచి పోయాయని చెప్పారు. ఆ పనులు పూర్తి చేయాలని సంకల్పంతో రూ.27లక్షలు కేటాయించి నేడు పూర్తి చేశామన్నారు.

ఆలయ అభివృద్ధికి రూ.1.10 కోట్లను కేటాయించామని చెప్పారు. పురావస్తు శాఖ అధ్వర్యంలో రూ.50 లక్షల నిధులతో ఆలయ ప్రాకారం పూర్తిగా సీసీ చేయించేలా నివేదికలను తయారు చేశామన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆలయ కమిటీ చైర్మన్‌ పోచారం సురేందర్‌రెడ్డికి సూచించారు. జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దఫేదర్‌ శోభ, కలెక్టర్‌ సత్యనారాయణ, జెడ్పీ కో–ఆప్షన్‌ మెంబర్‌ మాజీద్‌ఖాన్, ఎంపీపీలు విఠల్, నీరజ, సర్పంచ్‌ శ్యామల, ఎంపీటీసీ కుమ్మరి నారాయణ, నేతలు దివిటి శ్రీనివాస్, పెర్క శ్రీనివాస్, కిషోర్‌యాదవ్, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు