వీడిన మిస్టరీ : 9 మంది దారుణ హత్య

24 May, 2020 19:55 IST|Sakshi

బతికుండగానే బావిలో పడేశాడు

మక్సూద్‌ అల్లుడి డైరెక్షన్‌లో‌నే హత్యలు

సాక్షి, వరంగల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనలో సంచలనం నిజం బయటపడింది. మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో పోలీసులు గొర్రెకుంట మిస్టరీని చేధించారు. తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తున్న విధంగానే వారంతా హత్యకు గురయ్యారు. 9 మందిని తానే హత్య చేశానని కేసులో నిందితుడిగా ఉన్న బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్ అంగీకరించాడు. కుట్రపూరితంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పట్లు సంజయ్ చెప్పాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనె సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే ఢిల్లీలో మక్సూద్‌ ఆలం అల్లుడు ఖతూర్‌ డైరెక్షన్‌లోనే వారందరినీ దారుణంగా హత్య చేశానని సంజయ్‌ చెప్పడం కొసమెరుపు. ఇక మక్సూద్‌ భార్య, కూతురితో సంజయ్‌ వాట్సప్‌ చాటంగ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తొలుత ఇద్దరు బిహారీలను వదిలేద్దామని సంజయ్‌ భావించగా.. కేసు బయటకు వస్తే జైలుకు పోవాల్సి వస్తుందని వారిద్దరిని కూడా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం సంజయ్‌ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే వరంగల్‌ పోలీసులు కేసును చేధించడం గమనార్హం.

సంఘటన వివరాలు.. తొలుత గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డ విషయం తెలిసిందే. సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీశారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపంలోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్‌ (20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు. (విషప్రయోగం చేసి చంపారనే అనుమానం?)

శుక్రవారం మక్సూద్‌ కుమారులైన షాబాజ్‌ ఆలం(19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21) శ్రీరాం కుమార్‌షా(26) కనిపించకుండా పోవడం,సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్‌(30) అనే డ్రైవర్‌ మృతదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్‌ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్‌ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అనుమానితుడి భావిస్తున్న సంజయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కోణంలోనే తొలి నుంచి విచారించారు. పోలీసులు భావించిన విధంగానే వారు హత్యకు గురైయ్యారు.

మరిన్ని వార్తలు