‘పాటలు’ ఓకే.. ‘పోటీలతో’ షాకే!

6 Sep, 2019 09:00 IST|Sakshi

ప్రారంభం కానున్న లడ్డూ వేలం పాటలు

కొన్ని మండపాల వద్ద తినే పోటీలు సైతం

ప్రమాదహేతువు అంటున్న వైద్య నిపుణులు

ప్రసాదాలపై కన్నేసి ఉంచాలంటూ సూచనలు

సాక్షి, సిటీబ్యూరో: గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు కూడా అక్కడక్కడా జరుగుతుంటాయి. చివరి నాలుగైదు రోజులు ఈ పోటీలు జోరుగా జరుగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు పర్వాలేదు కానీ... వాటిని తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్‌ఎం రేడియో సంస్థ తార్నాకలో ఏర్పాటు చేసిన లడూŠుడ్ల తినే పోటీ జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తుచేస్తున్నారు. గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్‌ సంస్థలూ ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వివిధ ఆకృతులతో ఉన్న టోపీలు, టీ–షర్టులు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా... లడ్డూలు తినే పోటీలు వంటివీ నిర్వహిస్తారు. పోటీలో పాల్గొని అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తుంటారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు.  

కంగారులో ప్రాణాల మీదికి...
ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడంతో పాటు ఏమాత్రం విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా... ఇరుక్కున్న వాటిని తొలగించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ట్రేకియాను దెబ్బతీస్తాయి...
ఇలాంటి పోటీ నేపథ్యంలో లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రేకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారానే మనిషి శ్వాస తీసుకుంటాడు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమారుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. లడ్డూ పోటీల నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. ఫలితంగా ఆ ఆహారపదార్థాలు ట్రేకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి కన్ను మూస్తాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్‌ నెర్వ్‌పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్‌ అనేది ఏర్పడుతుందని ఫలితంగా గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు.

లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు
నగరంలో గణేష్‌ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు భక్తుల్ని ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే ‘శుభం’ అనే సెంటిమెంట్‌ సైతం కొందరికి ఉంటుందన్నారు. గతంలో ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరినట్లు తెలిపారు. అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తçస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండపాల నిర్వాహకులు పక్కాగా సీసీ కెమెరాలు కలిగి ఉండి రాత్రి వేళల్లో తమప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. అక్కడ కచ్చితంగా ఒక్క వాలెంటీర్‌ అయినా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు