మందేసి.. చిందేసి..!

29 Feb, 2020 03:54 IST|Sakshi

చేతిలో మద్యం బాటిళ్లతో పోలీసుల నృత్యాలు

సోషల్‌ మీడియాలో వైరల్‌

నందిగామ: షాద్‌నగర్‌ పోలీసులు ఇటీవల నాగిని డ్యాన్స్‌ చేసిన ఘటన మరవకముందే.. కొత్తూరు పీఎస్‌లో పనిచేస్తున్న పోలీసులు సైతం ఇలాంటి వీడియోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు. కొత్తూరు పీఎస్‌లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్‌ వివాహం ఈ నెల 12న షాద్‌నగర్‌ సమీపంలోని రామేశ్వరం ఆలయంలో జరిగింది. ఈ పెళ్లికి కొత్తూరు పీఎస్‌లో పనిచేసే 12 మంది పోలీసులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత సమీపంలోని ఓ వెంచర్‌లో విందు చేసుకున్నారు.

ఈ విందులో పాల్గొన్న కొంతమంది పోలీసులు మద్యం బాటిళ్లు చేతపట్టుకొని, మద్యం తాగుతూ, నృత్యాలు చేసిన వీడియోలు శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొత్తూరు ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబును వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను బిజీగా ఉన్నానని, ఏమైనా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాలని ఫోన్‌ కట్‌ చేశాడు. ఏఎస్సై అబ్దుల్లాను అడగగా ఈ నెల 12న ఉన్నతాధికారుల అనుమతితోనే వివాహ వేడుకకు హాజరైనట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు