మారుమూల ఠాణాలకు టెక్నాలజీ

17 May, 2018 05:18 IST|Sakshi

పోలీస్‌ వాహనాల బ్రాండింగ్‌లో స్వల్పమార్పు

త్వరలో అందుబాటులోకి 600లకు పైగా వాహనాలు

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖ మరింత ఆధునిక సాంకేతికతను సంతరించుకునేందుకు కసరత్తు చేస్తోంది. మారుమూల ఠాణాలను సాంకేతికంగా బలోపేతం చేయనుంది. దీనికితోడు మరిన్ని కొత్త వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్‌ శాఖకు అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా తెలంగాణ పోలీస్‌ బ్రాండ్‌ ప్రజల్లో గుర్తుండిపోయేలా వాహనాలపై తెలంగాణ పోలీస్‌ లోగోతోపాటు పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇంటర్‌సెప్టార్‌ తదితర పదాలను తీర్చిదిద్దారు. నాలుగేళ్ల క్రితం రూపొందించిన ఈ బ్రాండింగ్‌లో స్వల్ప మార్పు చేయాలని లోగో పొజిషన్, స్టిక్కరింగ్‌ కలర్‌లో కొంత మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.

బ్లూకోల్ట్స్‌ వాహనాలకు టెక్నాలజీపరంగా మార్పులు, చేర్పులు చేసి ఘటనాస్థలి నుంచే ఫొటోలు, వీడియోలు, వివరాలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పంపే విధంగా అనుసంధానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించడంతో ఠాణాల నుంచి డీజీపీ కార్యాలయానికి అనుసంధానం ఏర్పడింది. ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ, నిందితుల వివరాలు, ఫొటోలు.. ఇలా అన్ని క్షణాల్లో ఉన్నతాధికారుల చేతికి అందుతున్నాయి.   కొనుగోలు చేసే పెట్రోలింగ్‌ వాహనాల్లో ట్యాబ్, జీపీఎస్‌ అనుసంధానం, జియో ట్యాగ్‌ చేసిన హాట్‌స్పాట్లు కనిపించేలా టఫ్‌ప్యాడ్‌లు అందుబాటులోకి రాను న్నాయి. ఏసీ సదుపాయం కలిగిన పెట్రోలింగ్‌ వాహనాలతో గల్లీ గస్తీని మరింత విస్తృతం చేసేందుకు అవకాశం కల్పించి ట్లు అయింది. ప్రతీ ఠాణాకు రెండు పెట్రోలింగ్‌వాహనాలు, 4 బ్లూకోల్ట్స్‌ కొత్త వాహనాలు అందించాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.  

వాహనాల కొనుగోలుకు 500 కోట్లు
నూతన జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్ల నిమిత్తం పోలీస్‌శాఖకు మరిన్ని వాహనాలు అవసరమయ్యాయి. తాజాగా ఆరు వందలకుపైగా వాహనాలు కొనుగోలు చేయాలని  నిర్ణయించినట్టు తెలుస్తోంది.   గతేడాది హెచ్‌ఐసీసీలో జరిగిన పోలీస్‌ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ  మేరకు రూ.500 కోట్లతో మరిన్ని కార్లు, పెట్రోలింగ్‌ బైకులు కొనుగోలు చేస్తున్నట్టు పోలీస్‌ శాఖ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు