మూడు నెలల వ్యూహంతో.. 

12 Dec, 2018 01:28 IST|Sakshi

మావోయిస్టు ప్రాంతాల్లో ముందస్తు చాకచక్యం

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

పోలీసు శాఖ వ్యూహం సక్సెస్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చింది. షెడ్యుల్‌ విడుదలైనప్పటి నుంచి పోలీస్‌ శాఖ వ్యూహాత్మంగా భద్రతా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నిత్యం ముందస్తు భద్రత, బందోబస్తు, బైండోవర్లు, ఆయుధాల డిపాజిట్‌.. ఇలా అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంది. సుమారు లక్ష మంది పోలీస్‌ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసి శభాష్‌ అనిపించుకుంది.  

రూ.వంద కోట్లపైగా స్వాధీనం 
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులు, ప్రత్యే క తనిఖీ బృందాలు ఏర్పాటు చేసిన పోలీస్‌ శాఖ, నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిననాటి నుం చి ఐటీ విభాగంతో కలసి రూ.125 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఎక్సైజ్‌ విభాగంతో కలసి 4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 17 కిలోల బంగారం, 689 గ్రా ముల వజ్రాలు, 121 కిలోల వెండి, 267 కిలోల గంజాయి, రూ.1.68 కోట్ల బహుమతులను స్వాధీనం చేసుకుంది. ఏ ఎన్నికల్లోనూ లేని తీరుగా నాన్‌బెయిలబుల్‌ వారెంట్లను జారీ చేసింది. 14 వేలకుపైగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్లలో 11,862 వారెంట్లను అమలు చేసి సంబంధిత వ్యక్తులను కోర్టులో హాజరుపరచింది. నేరచరిత్ర ఉన్న 90,238 మందిని బైండోవర్‌ చేసింది.    

వ్యూహాత్మకంగా.. 
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో మావో యిస్టుల ప్రభావం ఉంటుందని నిఘావర్గాలు ముందే పసిగట్టాయి. పోలీస్‌శాఖ గ్రేహౌండ్స్‌ బలగాలతో కూంబింగ్‌ విస్తృతం చేసి రాష్ట్ర సరి హద్దులోకి మావోలను అడుగుపెట్టనీయకుం డా చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో చేసుకున్న సమన్వయం విజయవంతమైనట్లు పోలీస్‌ శాఖ తెలిపింది. ఎన్నికల రోజు ఖమ్మం జిల్లా చర్లలో మావోలు పాతిపె ట్టిన ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఈ చర్యకు పాల్పడ్డ యాక్ష న్‌ టీంను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు జిల్లా స్పెషల్‌ బృందాలను రంగంలోకి దించారు. కల్వకుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థిపై దాడి తప్ప, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదు.   

ప్రజల సహకారంతోనే: డీజీపీ 
‘3 నెలలుగా అసెంబ్లీ ఎన్నికల కోసం భద్రతాచర్యలు చేపట్టాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు, అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో దిగ్విజయంగా ఎన్నికలు నిర్వహించాం. పోలీస్‌శాఖలోని కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అంద రూ రాత్రిపగలు తేడా లేకుండా పనిచేశారు. పోలీస్‌ సిబ్బందికి, ప్రజలకు ధన్యవాదాలు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.   

మరిన్ని వార్తలు