పోలీస్‌ చూపు.. వీక్లీఆఫ్‌ వైపు!

24 Dec, 2018 01:34 IST|Sakshi

ఏళ్లుగా వారాంతపు సెలవుల కోసం పోలీస్‌ సిబ్బంది నిరీక్షణ 

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలోని కింది స్థాయి సిబ్బందిలో హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు వారాంతపు సెలవుల అంశాలు కొన్నేళ్ల నుంచి నానుతూ వస్తున్నాయి. నూతన హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమూద్‌ అలీ వారాంతపు సెలవులపై చర్యలు చేపడతామని ప్రకటించడంతో మరోసారి పోలీస్‌ సిబ్బందిలో ఆశలు రేకెత్తాయి. ఈ రెండు అంశాలపై హోంమంత్రి మహమూద్‌ అలీ ఎంతమేరకు సమస్య పరిష్కరిస్తారన్న దానిపై పోలీస్‌శాఖలో సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఆ రెండు విభాగాల్లోనే కష్టం..
పోలీస్‌ శాఖలో శాంతి భద్రతల విభాగం, ట్రాఫిక్‌ విభాగం ఈ రెండు చాలా కీలకమైనవి. ఈ విభాగా ల్లో పనిచేస్తున్న సిబ్బంది 24 గంటలు, 365 రోజులు డ్యూటీలోనే ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్, అర్బన్, రూరల్‌ 3 విధాలుగా స్టేషన్ల విభజన ఉంటుంది. కమిషనరేట్ల పరిధిలో స్టేషన్ల ఇన్‌చార్జిలుగా ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అధికారి ఉంటారు. ఈ ఠాణాల్లో సీఐతో కలిపి మొత్తం సిబ్బంది 42 నుంచి 50 మంది వరకు ఉంటారు. అర్బన్‌ పోలీస్‌ స్టేషన్లలో మొత్తం సిబ్బంది 28 నుంచి 34 వరకు ఉంటారు. రూరల్‌ పోలీస్‌ స్టేషన్లు అంటే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారి స్టేషన్‌ ఇన్‌చార్జిగా ఉండ గా, 22 నుంచి 28 మంది సిబ్బంది ఉంటారు. ఈ మూడు రకాల ఠాణాల్లో ప్రతీ ఒక్క సిబ్బందికి వారి వారి విధులు నిత్యం ఉంటూనే ఉంటాయి. అలాగే ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర వీఐపీ పర్యటనలు తదితరాల కారణంగా వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తే శాంతి భద్రతల పరిరక్షణపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుం దని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. అర్బన్‌ ప్రాంతాలు, రాజధాని, దాని చుట్టుపక్కల కమిషనరేట్లలో ట్రాఫిక్‌ నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ ఇవ్వలేకపోయినా షిఫ్ట్‌ల వారీగా పనులు విభజన చేస్తున్నారు. 

డిప్యుటేషన్‌లో ఓకే..
పోలీస్‌శాఖలో లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ కాకుండా డిప్యూటేషన్‌ విభాగాల్లో వీక్లీ ఆఫ్‌కు పెద్దగా ఇబ్బంది లేదు. నేర పరిశోధన విభాగం (సీఐడీ), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక శాఖ (ఏసీ బీ), రాష్ట్ర పోలీస్‌ అకాడమీ, పోలీస్‌ కంప్యూటర్స్‌ అండ్‌ టెక్నికల్‌ సర్వీస్‌ తదితరాల్లో ప్రతీ ఆదివారం సెలవు దినం కావడంతో ఆయా విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది వీక్లీ ఆఫ్‌గా తీసుకుంటున్నారు.  రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్‌ శాఖలో నియా మకాల ప్రక్రియ అన్ని విభాగాల కన్నా వేగంగా, ఎక్కువ సంఖ్యలో జరిగింది. 12 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీ పూర్తయి రెండేళ్లు గడిచింది. అలాగే మరో దఫాలో 16 వేల కానిస్టేబుల్, 1,000కి పైగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ 50 శాతం మేర పూర్తయింది. ఈ భర్తీ పూర్తయితే రాష్ట్ర పోలీస్‌ శాఖలో 70 వేల మంది పైగా సిబ్బంది అందు బాటులో ఉంటారు. దీంతో సిబ్బంది పెరుగు దలను దృష్టిలో పెట్టుకొని వీక్లీ ఆఫ్‌ అమలు చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

గెజిటెడ్‌ హోదా ఎప్పుడు?
రాష్ట్రంలో 8 వేల మందికి పైగా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మండల స్థాయితో పాటు అర్బన్, కమిష నరేట్లలో ఎస్సైల పాత్ర చాలా కీలకం. మండలా ల్లో పనిచేస్తున్న ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ, ఈఓపీఆర్‌ డీ..తదితర అధికారులంతా గెజిటెడ్‌ అధికారులే. వారితో సమానంగా మండలాల్లో కీలకంగా పనిచే స్తున్న తమకు గెజిటెడ్‌ హోదా ఇవ్వకపోవడం ఎస్సైలను ఏళ్లుగా నిరాశకు గురిచేస్తోంది. ప్రతీ క్షణం ఉద్యోగం చేసే తమకు ఈసారైనా  గెజి టెడ్‌ హోదా కల్పించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు