రైతు మెడపై నకిలీ కత్తి

15 Jun, 2019 10:04 IST|Sakshi

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో జిల్లాలో మళ్లీ నకిలీ పత్తివిత్తనాలు జోరందుకున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తివిత్తనాలతో పాటు, నకిలీ విత్తనాలు కూడా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. విత్తన వ్యాపారులు, జిన్నింగ్‌మిల్లుల నిర్వాహకులు, దళారులు ఈ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ఈ విత్తనాలను రైసుమిల్లులు, జిన్నింగ్‌మిల్లుల్లో నిలువ ఉంచి, రైతులతో తమకున్న సంబంధాలను వినియోగించుకొని అంటగడుతూ మోసగిస్తున్నారు. ఓ వైపు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నా.. మరోవైపు నకిలీ, నిషేధిత విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి.                                                   

సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో సత్యనారాయణ అనే రైసుమిల్లు యజమాని ఇంట్లో వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పోలీసులు సోదాలు నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచారనే సమాచారంతో ఈనెల 13న దాడులు చేయగా.. బియ్యం బస్తాల్లో దాచి ఉంచిన 120 కిలోల నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.40 లక్షలు. వాటిని రైతులకు విక్రయించడానికి సిద్ధమైన సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లాలో పత్తి పంట సాగుకు అధిక శాతం రైతులు మొగ్గుచూపుతుంటారు. గత సంవత్సరం 1.39లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా. ఈ ఏడాది 1.51లక్షల ఎకరాల్లో సాగుచేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సాగు కోసం దాదాపు 3.10లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని గుర్తించారు. సాధారణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తుంటారు. కానీ అధికారులకన్నా.. ఏటా కొనుగోలు చేసే విత్తన వ్యాపారులనే రైతులు నమ్ముతుంటారు. రైతుల నమ్మకాన్ని ఆసరగా తీసుకుని విత్తన వ్యాపారులు వారిని నిండాముంచుతున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలతో పాటు, నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

నకిలీ, నిషేధిత విత్తనాల అమ్మకాలు
జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలతో పాటు, నాసిరకం విత్తనాలకు రంగులు అద్ది నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. పర్యావరణం దెబ్బతినడం, క్యాన్సర్‌ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం గ్‌లైసిల్‌ పత్తివిత్తనాలు, గ్‌లైఫోసిట్‌ మందులను నిషేధించింది. నిషేధించి సంవత్సరాలు గడుస్తున్నా అమ్మకాలను మాత్రం అరికట్టలేకపోతోంది. ఈ సీజన్‌లో మళ్లీ నిషేధిత గ్లైసిల్, గ్లైఫోసెట్‌ అమ్మకాలు గ్రామాల్లో జోరందుకుంటున్నాయి.

వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. ఈ విత్తనాలు వాడితే పత్తిలో కలుపు సమస్య ఉండదని, గులాబీ పురుగు నివారణకు మెరుగ్గా పనిచేస్తుందని నమ్మబలికి రైతులకు అంటగడుతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. విత్తనాలు, ఎరువుల దుకాణాల ద్వారానే ఈ వ్యాపారం ఎక్కువగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. చీడను తట్టుకుంటుందని, కలుపు తీయడానికి కూలీల సమస్య ఉండదనే కారణంగా రైతులు ఈ నిషేధిత పత్తి విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిషేధించినప్పటికీ గ్రామాల్లో కొనుగోళ్లు జరగడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు. అలాగే నకిలీ విత్తనాల దందా జిల్లాలో సాగుతోంది. నాసిరకం విత్తనాలకు రంగులు అద్ది, ఆకర్షణీయమైన సంచుల్లో విక్రయిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచే...
ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ, నిషేధిత విత్తనాలు జిల్లాకు దిగుమతవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి ఈ విత్తనాలు జిల్లాకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన నకిలీ, నిషేధిత విత్తనాలను జిల్లాలోని రైసుమిల్లులు, జిన్నింగ్‌మిల్లుల్లో నిలువ ఉంచారు. రబీలోనే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు తెప్పించుకుని నిల్వ ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కావడంతో గోదాముల్లో దాచి ఉంచిన విత్తనాలను మార్కెట్లకు తరలిస్తున్నారు. అలాగే గ్రామాల్లోని కొంతమంది రైతులు, దళారులకు కమీషన్‌ ఇచ్చి వారి ని ఈ దందాలో భాగస్వామ్యులను చేస్తున్నారు.

ప్యాకెట్లతోపాటు విడిగా కిలోల చొప్పున కూడా తేలిగ్గా విక్రయిస్తున్నారు. ఓ ముఠాగా ఏర్పడిన కొంతమంది వ్యాపారులు నకిలీ, నిషేధిత విత్తనాల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మార్చి నెలలో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, తాళ్లగురిజాల, నెన్నెల, కన్నెపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి 13 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.65 లక్షల విలువైన నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనపరచుకున్నారు. నకిలీ, నిషేధిత పత్తివిత్తనాల దందాను మరో 20 మంది వ్యాపారులు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన జిల్లాలో చాలా పెద్ద ముఠాయే ఈ కార్యకలాపాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నకిలీ, విత్తన దందా సాగిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే విత్తనాలకు నకిలీ చీడ తగిలి దిగుబడి రాక అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు