ఇండోనేసియన్ల కదలికలపై పోలీసుల నజర్‌ 

22 Mar, 2020 03:26 IST|Sakshi
ఇండోనేసియన్లను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్న దృశ్యం (ఫైల్‌)

ఈ నెల 15న ఇండోనేసియన్లతో అతివాద సంస్థ నేత భేటీ? 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కలకలానికి కారణమైన ఇండోనేసియా బృందం కరీంనగర్‌లో ఎవరెవరిని కలిసిందనే విషయమై పోలీసులు దృష్టి పెట్టారు. ఆ బృందంలోని పది మందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వీరిని కలసిన వారి ద్వారా ఎం త మందికి విస్తరిస్తుందోనన్న ఆందోళన ఎక్కువైంది. మత ప్రచారం కోసం వచ్చినట్లు చెబుతున్న ఇండోనేసియన్లను కరీంనగర్‌లో ఓ అతివాద సంస్థ నేత కలసినట్లు తేలడం కలవర పెడుతోంది. ఆ నేత ఇండోనేసియన్లను కలసిన రెండో రోజు వందలాది మంది విద్యార్థులతో తన ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశం కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫి ర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమావేశమయ్యారని కేసు పెట్టి అదేరోజుస్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. అప్పటికే ఇండోనేసియన్లను సదరు వ్యక్తి కలసినట్లు పోలీసులకు తెలియదు. 

రెండు నెలల్లో మూడు బృందాల రాక 
జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, బోధన్‌తో పాటు కరీంనగర్, రామగుండం ప్రాంతాలకు ఇండోనేసియన్లు 4 నెలలుగా తరచూ వచ్చి పోతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.2 నెలల వ్యవధిలో 3 ఇండోనేసియా బృందాలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పర్యటించినట్లు స్పష్టమవుతోంది.  కరోనా సోకిన బ్యాచ్‌ కాకుండా నాలుగు జంటల బృందం ఫిబ్రవరి 8న రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల,  పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిసింది. గత నెల 17న జగిత్యాలలో అతివాద సంస్థ ఆవిర్భావ దినోత్సవంలో వీరు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

ఇస్లాం ధర్మ బోధనకే ఇండోనేసియా బృందాలు 
కరీంనగర్‌కు ఇండోనేసియా బృందాల రాకపై అసత్య ప్రచారం జరుగుతోంది. 70–80 సంవత్సరాల నుంచి దివ్యగ్రంథాల (ఖురాన్, హదీస్‌) వెలుగులో ఇస్లాం ధర్మం గొప్పతనాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి బోధకులు వస్తూ ఉంటారు. సమాజహితం, శాంతి స్థాపనకు బోధకులు అల్లాహ్‌తో ప్రార్థిస్తారు. భారత్‌ నుంచి సైతం ఇస్లాం బోధకులు విదేశాలకు వెళ్తుంటారు. వీరికి ఉగ్రవాదులతో ఎలాం టి సంబంధం లేదు. కరీంనగర్‌లో ట్రైనింగ్‌ విద్యా సంస్థ నడుపుతున్న వ్యక్తితో ఇండోనేసియన్లకు ఎలాంటి సంబంధం లేదు.  
–సయ్యద్‌ గులాం అహ్మద్‌ హుస్సేన్, ఎంఐఎం కరీంనగర్‌ నగర అధ్యక్షుడు  

కరీంనగర్‌లో విస్తరణకు పోలీసుల అడ్డు 
నిజామాబాద్‌లో ఆగస్టు 21న పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అతివాద సంస్థ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నిజామాబాద్, జగిత్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జగిత్యాలలో ఈ సంస్థకు ఓ కార్యాలయం ఉండగా, నాయకులపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. వందలాది మంది సానుభూతి పరులు ఉన్న ఈ సంస్థను కరీంనగర్‌లో విస్తరించే ప్రయత్నాలను పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇప్పటికే  40 మంది  కార్యకర్తలను గుర్తించి పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  ఇటువంటి సంస్థలను, వ్యక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని కమిషనర్‌ ‘సాక్షి’కి చెప్పారు. ఇండోనేసియా బృందాన్ని అతివాద సంస్థ నేత కలసిన అంశం విచారణ చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు