-

ఐటీ ఉద్యోగినిపై పోలీసుల అసభ్య ప్రవర్తన

19 May, 2020 08:45 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముషీరాబాద్ ‌: మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన తమను పోలీసులు అవమానించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఓ ఐటీ ఉద్యోగిని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. వైద్యుల సూచన మేరకే మేము వాకింగ్‌ వచ్చామని, సోదరుడు హార్ట్‌ పేషెంట్‌ అని చెప్పినా వినిపించుకోలేదని వాపోయింది.  విచారించిన మానవహక్కుల కమిషన్‌ జూలై 31లోపు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. బాధితులు తెలిపిన మేరకు.. ఈనెల 14న  నారాయణగూడ విఠల్‌వాడికి చెందిన ఓ మహిళ తన సోదరుడితో కలిసి ట్యాంక్‌బండ్‌ వద్ద వాకింగ్‌ చేస్తోంది.  

చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై కోటేష్‌, కానిస్టేబుళ్లు పి. అరుణ్‌కుమార్, జి. అరవిందసాగర్‌లు అడ్డగించి ఫొటోలు తీశారు. ప్రశ్నించిన తమపై దురుసుగా ప్రవర్తించడమే కాక కేసు బుక్‌ చేస్తున్నామని తెలిపారు.బాధితురాలు తన తండ్రికి ఫోన్‌ ద్వారా తెలియజేయగా తండ్రి ఘటనా స్థలానికి వచ్చారు. అతనిని కూడా దూషించారు. ఫోన్లను లాక్కొని బలవంతంగా బైక్‌ను సీజ్‌చేసి  తండ్రిని, సోదరుడిని పోలీస్‌ వ్యాన్‌ ఎక్కించుకొని తీసుకువెళ్లారని కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో   పేర్కొన్నారు. 

ఆగని సైబర్‌ మోసాలు
సాక్షి, సిటీబ్యూరో: నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో సోమవారం పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన అధికారులు కొన్నింటిపై కేసులు నమోదు చేశారు. మరికొన్నింటి విషయంలో న్యాయ నిపుణులు అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించారు.  

మాస్కులు అమ్ముతామంటూ మస్కా... 
నగరానికి చెందిన వ్యాపారి బిపిన్‌ కుమార్‌ ఫేస్‌మాసు్కలు పెద్ద సంఖ్యలో ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆయన ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన పొందుపరిచారు. అందులో ఉన్న నెంబర్‌ ఆధారంగా బిపిన్‌ను సంప్రదించిన సైబర్‌ నేరగాళ్ళు తాము సరఫరా చేస్తామని అన్నారు. బేరసారాల తర్వాత అడ్వాన్సు చెల్లిస్తే కొరియర్‌ పంపిస్తామన్నారు. దానికోసమంటూ కొన్ని క్యూఆర్‌ కోడ్స్‌ పంపించారు. వాటిని వ్యాపారి స్కాన్‌ చేయడంతో తన ఖాతాలోని రూ.59 వేలు నేరగాళ్ళకు చేరాయి. 

వాహనం అమ్ముతామని... రుణం ఇస్తామని... 
నగరానికి చెందిన ఓ యువకుడు సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనం ఖరీదు చేయాలని భావించారు. దానికోసం ఆయన ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్‌ చేశారు. ఓ ప్రకటన చూసి ఆకర్షితుడైన ఆయన అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదించారు. వాహనం విక్రయించడానికి బేరసారాలు పూర్తి చేసిన నేరగాళ్ళు అడ్వాన్సు, ఇతర ఖర్చుల పేర్లతో రూ.39,650 తమ ఖాతాల్లో వేయించుకుని మోసం చేశారు. మరో ఉదంతంలో సిటీకి చెందిన ఓ యువకుడికి రుణం పేరుతో  రూ.12,500 కాజేశారు.  అలాగే.. తమ సంస్థ పేరుతో రుణాలు ఇస్తామంటూ ప్రకటన చేసిన ఓ కంపెనీపై ఐటీసీ సంస్థ న్యాయవాది సోమ వారం ఫిర్యాదు చేశారు. తమకు ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ తమ పేరు వినియోగిస్తూ రూ.20 కోట్ల రుణం ఇస్తామంటూ మోసానికి ప్రయతి్నంచారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు