సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలు సడలించాక కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నివిధాలుగా అవగాహన కల్పిస్తున్నా కొందరు నిబంధనలను పెడచెవిన పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ మంత్రి బంధువు హోటల్లో రేవ్పార్టీ, మరో వ్యాపారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై పోలీసులు కన్నెర్ర జేశారు. ఇకపై రాష్ట్రంలో అనుమతి లేకుండా పార్టీలు, విందులు నిర్వహిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 26 వేలకు చేరువైన నేపథ్యంలో పార్టీలు, విందుల అనుమతులను కఠినతరం చేయనున్నారు. ముందస్తు అనుమతి లేకుండా చేపట్టే ఇలాంటి వేడుకలను ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే పోలీస్స్టేషన్లలోకి వచ్చే ఫిర్యాదుదారులు మాస్కులేకుండా వచ్చినా గుంపులుగా ప్రవేశించినా ఎపిడమిక్ యాక్ట్ 51(బి) ప్రకారం కేసుల నమోదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.