కేసు నమోదులో నిర్లక్ష్యం... ఎస్‌ఐ, ఏఎస్‌ఐ సస్పెన్షన్

16 Dec, 2017 10:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఒక కేసులో బాధితురాలిచ్చిన ఫిర్యాదుపై సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయకపోవడంతో కుషాయిగూడ ఎస్పై, ఏఎస్సైలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. 2016లో సైదమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె భర్త మహేశ్వరం వెంకన్న పెట్టిన బాధలను తట్టు కోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ, మృతురాలి తల్లి గుండమల్ల రాములమ్మ కుషాయి గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదుపై అప్పటి ఎస్సై సుధీర్‌కృష్ణ, ఏఎస్సై శ్రీశైలంగౌడ్‌లు సరైన కేసుల కింద కేసు నమోదు చేయకపోవడంతో పాటు, విచారణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీపీ దర్యాప్తుకు ఆదేశించడంతో కుషాయిగూడ ఏసీపీ దర్యాప్తు జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. నివేదిక ఆధారంగా ఎస్సై, ఏఎస్సై లను సస్పెండ్ చేస్తూ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై సుధీర్ కృష్ణ ప్రస్తుతం ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు