తస్మాత్‌ జాగ్రత్త..!

1 Aug, 2019 13:22 IST|Sakshi

అసలే వర్షాకాలం.. ఆపై అందరూ పొలం పనుల్లో నిమగ్నమవుతుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ బిజీబిజీగా గడుపుతారు. ఫలితంగా ఇళ్లు దాదాపుగా ఎవరూ లేకుండా ఉంటాయి! ఇదే అదునుగా భావించే చోరులు చోరీలకు ఎగబడుతారు. అందినంత దోచుకెళ్తారు. ఇలాంటి సమయాల్లో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని, టూర్లకు, ఇతర ఊళ్లకు వెళ్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

సాక్షి, నిజామాబాద్‌ : సాధారణంగా వర్షాకాలం రాగానే పొద్దున లేవగానే పల్లె ప్రజలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతారు. ఉదయం అనగానే చేన్లలోకి వెళ్లిన రైతులు చీకటి పడేదాక ఇంటి ముఖం చూడకుండా పంట పొలాల్లో పనులు చేస్తారు. పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తుంటారు. ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఎవరి పనికి వారు వెళ్లేదానిని అదునుగా భావించి దుండగులు చక్కగా ఇళ్లట్లోకి చొరబడి బంగారం, నగదు సొత్తుతో పారిపోతుంటారు. ఊళ్లకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దుండగులు చెలరేగుతుంటారు. పోలీసులు కూడా ప్రతి ఇంటినీ గమనించలేరు. అందుకే ప్రజలు కూడా చైతన్యం కావాలంటున్నారు వారు. అందుకోసం భిక్‌నూర్‌ సీఐ రాజశేఖర్‌ ప్రజలకు పలు సూచనలు జాగ్రత్తలు తెలుపుతున్నారు. 

కొత్త వ్యక్తులు వస్తే తెలపాలి.. 
చోరీలకు వర్షాకాలం అనువుగా ఉంటుంది. దుండగులు ఎంచుకున్న ఇంటి పరిసరాలను రెండు, మూడు రోజులు ముందు పరిశీలిస్తారు. అంటే చెత్త కాగితాలు, భిక్షగాళ్లుగా, వస్తువులు అమ్మేవారిగా వచ్చి చుట్టూ పక్కల పరిశీలించిన అనంతరం ప్రణాళిక రచించి సులువుగా పని ముగించుకుంటారు.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
చోరీలకు వచ్చే దుండగులు ఒకరోజు ముందే పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 
ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోర్డులు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడూ చూసుకోవాలి.  
 దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌కు తెలపాలి. 
 రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు సేకరించి పెట్టుకోవడం మంచిది.  
 దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు. దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైతే కాపాలదారున్ని ఏర్పాటు చేసుకోవాలి. 
 వ్యవసాయ పనులకు వెళ్లేవారు చుట్టుపక్కల వారికి తెలియజేయాలి. తాళం వేసి వాటి తాళాలను ఇంటి దగ్గర పెట్టకూడదు. 
 ప్రతి ఇంట్లో తాళాలు వేసి తాళాలను అక్కడే ఉంచడంతో దొంగలకు అవకాశాలు ఎక్కువగా ఉండి దోచుకునేందుకు వీలవుతుంది. వాటిని పెట్టకూడదు. 
 ఇంటికి ఒకటి, లేక రెండు తాళాలు వేసుకోవాలి. దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. 
 బంగారు ఆభరణాలు ధరించి నిద్రించకూడదు. కిటికీలు తెరిచి ఉండేవైపు పడుకోరాదు. 
 ఇంట్లో బంగారం, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం అన్ని విధాలా ఉత్తమం. 
    పోలీసు కంట్రోల్‌ రూం నం.100 

ముందస్తు సమాచారమివ్వాలి.. 
గ్రామాల ప్రజలు ప్రస్తుతం వ్యవసాయ ప నుల్లో నిమగ్నమయ్యా రు. ఇంటికి తాళాలు వేసుకొని చేన్లలోకి వెళ్లే ముందు చుట్టు పక్కల వారికి తెలియజేయాలి. ముఖ్యంగా మహిళలు పొలం వద్దకు ఒంటరిగా పోవద్దు. ఒకవేళ యాత్రలకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. ఊర్లకు వెళ్లేవారి ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే వాటిని బంద్‌ చేయకుండా ఉంచాలి.  
–సురేష్, ఎస్‌ఐ, బీబీపేట. 

జాగ్రత్తలు తీసుకోవాలి.. 
పట్టణాలు, వివిధ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీంతోపాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పిల్లలకు సెలవులు ఉన్న సమయంలో తీర్థయాత్రలకు, టూర్‌లకు, సొంత గ్రామాలకు వెళ్లేవారు వారి పరిధిలోని పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ ఏర్పాటు నిర్వహిస్తున్నారు. 
–రాజశేఖర్, సీఐ, భిక్కనూరు. 

>
మరిన్ని వార్తలు