ఏకకాలంలో ఏ రెండు పార్టీలకు అనుమతి నో
ప్రచారంలో అల్లర్లు జరగకుండా పోలీస్ నిఘా
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో చర్యలు
సాక్షి,సిటీబ్యూరో: లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో రాజకీయ నాయకుల ప్రచారం కూడా ఊపందుకుంది. మరో పదిరోజులు ప్రచారానికి అవకాశం ఉండడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార జోరు పెంచారు. ఈ క్రమంలో ఏ రెండు పార్టీల వారు ఒకేసారి సమావేశాలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆయా పార్టీ నేతల అగ్రనాయకుల ప్రచారాలు, బహిరంగ సభలు, రోడ్షోలకు ఒకే సమయంలో అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఎందుకంటే ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ఎన్నికల ప్రచారాలకు అనుమతివ్వడం వల్ల ఆయా పార్టీల కార్యకర్తలు ఎదురుపడి గలాటాకు ఆస్కారం ఉండటంతో ప్రత్యేక కార్యాచరణతో పోలీసులు ముందుకెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఈ లోక్సభ ఎన్నికల్లోను అనుసరిస్తున్నట్టు సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతి ఠాణా పరిధిలో హోంగార్డు నుంచి ఇన్స్పెక్టర్లతో పాటు ఏసీపీ, డీసీపీలు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నారు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ఆయా పార్టీ కార్యకర్తలపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్న పోలీసులు ఆయా పార్టీ నాయకుల ప్రచారానికి బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. గొడవలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.
ఇరు కమిషనరేట్లలో భారీ భద్రత
పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలతో మిళితమైన సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎన్నికలు సజావుగా సాగేందుకు వేలసంఖ్యలో పోలీసులను రంగంలోకి దింపారు. చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాలతో పాటు కొన్ని ప్రాంతాలు కలిసే ఐదు సెగ్మెంట్లలో ఉన్న 2,868 పోలింగ్ బూత్లలో 214 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ తదితర 25 కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోని దింపారు. వీరితో పాటు పదివేల మంది పోలీసులు, 2,000 మంది ఆర్మ్డ్ ఫోర్స్ సిబ్బంది భద్రతా విధులకు వినియోగిస్తున్నారు. రెండు కమిషనరేట్లలో ఇప్పటి దాకా 550 మంది అనుమానాస్పద వ్యక్తులను బైండోవర్ చేశారు. అలాగే ఐదు లోక్సభ నియోజకవర్గాలు వచ్చే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,215 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక్కడ ఆరువేల మంది పోలీసులతో పాటు 11 పారా మిలిటరీ కేంద్ర కంపెనీలు భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నాయి. ప్రచారపర్వంలో ఓటర్లను ప్రభావితం చేసే వీలున్న డబ్బు, మద్యం రవాణాను కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన లోక్సభ ఎన్నికలు జరగనుండగా రెండు రోజుల ముందే తొమ్మిదో తేదీన రాజకీయ ప్రచారం ముగియనుంది.