పోలింగ్‌ చీటీపైనే అన్నీ.

10 Apr, 2019 15:20 IST|Sakshi
పోలింగ్‌ చీటి వెనకాల కేంద్రం మ్యాప్, వివరాలు

చీటీల వెనుక కేంద్రం పటం, మార్గం వివరాలు 

వాంకిడి(ఆసిఫాబాద్‌): ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల కమిషన్‌ ఓట్ల శాతం పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ చీటీలను బీఎల్‌వోల ద్వారా పంచి పెట్టింది. ఓటర్లకు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలింగ్‌ చీటీపైనే ఓటరు ఫొటో, పోలింగ్‌ కేంద్రం మ్యాప్, బీఎల్‌వో పేరు, ఫోన్‌నంబర్, కేంద్రం సమస్త వివరాలను ముద్రించింది. దీంతో గత ఎన్నికల్లో ఓటరు ఓటు వేయాలన్న కేంద్రం ఎక్కడుంది, ఓటు వేయాడానికి వెళ్లాలన్న ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్నికల కమిషన్‌ ఓటరు ఫొటోతో కూడిన పోలింగ్‌ చీటీలను పంపిణీ చేస్తూ వాటి వెనుకలో కేంద్రం మ్యాప్, వివరాలను పొందుపర్చారు.

దీంతో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ విధానం అములు చేయడంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడానికి దోహదపడడంతో తిరిగి అదే విధానాన్ని పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు.జిల్లాలో మొత్తం 583 పోలింగ్‌ కేంద్రాలు చేశారు. ఇందులో సిర్పూర్‌(టి) నియోజకవర్గంలో 283, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 300ల కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 4,02,663 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 1863 మంది అధికారులను నియమించారు.

ఓటర్లు వచ్చేలా చర్యలు  
పోలింగ్‌ చీటీలో ముద్రించిన సూచనలు ఇలా.. 

మీ గుర్తింపును నిరూపించడానికి ఓటరు చీటి మాత్రమే సరిపోదు, మీ గుర్తింపును బలపర్చడానికి మీరు మీ ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 11 డాక్యూమెంట్లలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పని సరిగా మీ వెంట తీసుకురావాలి. పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూ వరుసలో ఉన్న ఓటర్లందరికీ టోకెన్‌ జారీ చేసి తమ ఓటు వేయడానికి అనుమతిస్తారు. మహిళకు ప్రత్యేక క్యూ ఉంటుంది. వయోవృద్ధులకు ఓటింగ్‌ నిమిత్తం ప్రాధాన్యం ఉంటుంది.

అందులు, శారీరక వైకల్యం కలిగిన ఓటరు ఓటు వేయడం కోసం కంపార్టుమెంటు వద్దకు తీసుకెళ్లేందుకు ఒక వయోజనుడిని సహాయకుడిగా అనుమతించవచ్చు. మొబైల్‌ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించరు. ఒక నిర్ణీత అభ్యర్థి కోసం ఓటు వేయడానికి డబ్బు లేదా ఏదేని ఇతర విధాలైన ప్రతిఫలాన్ని ఇవ్వజూపడం లేదా అంగీకరించడం చట్ట ప్రకారం అవినీతి చేష్ట కిందకు వస్తుంది. ఏ ఒక్క ఓటరును వదిలేయరాదు. ప్రతీ ఓటు లెక్కించబడుతుంది.

ఓటరు చెంతలోనే పోలింగ్‌ చీటీలు

మండలాల వారీగా ఏర్పాటు చేసిన బీఎల్‌వోలు పోలింగ్‌ చీటీలను వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అలా పంపిణీ చేసిన అనంతరం బీఎల్‌వోలు ఓటరులకు పోల్‌ చీటిలు ముట్టినట్లు సదరు ఓటరు ద్వార సంతకాలు తీసుకుంటున్నారు. ఇలా పోలింగ్‌ చీటీలు ఇవ్వడానికి బీఎల్‌వోలు వెళ్లినప్పుడు ఇంట్లో ఓటరు లేకున్న దిగులు పడకుండా ఓటింగ్‌ సమయంలో కేంద్రాల వద్ద ఉన్న బీఎల్‌వో వద్ద నుంచి తమ పోలింగ్‌ చీటీలు సేకరించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చనే వెసులుబాటు కల్పించారు.   

మరిన్ని వార్తలు