దేవుడి పేరుతో నాటకం.!

3 Mar, 2018 09:29 IST|Sakshi
ఇందిరమ్మ ప్లాట్‌ ముందు దేవుని కోసం నిర్మించిన గద్దె

ఇందిరమ్మ ప్లాటులో లబ్ధిదారుఇల్లు కట్టుకోకుండా ఎత్తుగడ

తన మాట విననందుకు ఓ నాయకుడి దుశ్చర్య

లబోదిబోమంటున్న బాధితురాలు

నిజామాబాద్‌, మోర్తాడ్‌(బాల్కొండ): తాను కోరిన ధరకు ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని విక్రయించలేదనే అక్కసుతో ఒక నాయకుడు ఆ ఇంటి స్థలం ముందు దేవుడు వెలిసాడనే నాటకాన్ని మొదలు పెట్టడంతో బాధితురాలు లబోదిబోమంటుంది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలతో వ్యాపారం చేసే భూ భకాసురుల ఆగడాలకు అంతులేకుండా పోతుందనేందుకు దేవునిపేరుతో జరుగుతున్న నాటకమే నిదర్శనం. మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని భగత్‌సింగ్‌ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్లాట్లను కేటాయించారు. కొంత మంది ఇండ్లు నిర్మించుకోగా మరికొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగులేక పోవడంతో ఇంటి నిర్మాణాలను మధ్యలోనే నిలపివేశారు. అయితే ఈ కాలనీలో ఉండే కొందరు నాయకులు యథేచ్ఛగా ఇంటి స్థలాలను, నిర్మించిన ఇండ్లను కొనుగోలు చేసి విక్రయించడం చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎక్కువ ధరకు విక్రయించి తమ జేబులు నింపుకుంటున్నారు.

అయితే ఇటీవల లక్ష్మి అనే మహిళ తనకు కేటాయించిన స్థలంలో ఆమె పిల్లర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసింది. అంతలోనే ఆమె దత్తత తీసుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసింది. అయితే ఈ సమయంలో ఓ నాయకుడు ఆమెను ఇందిరమ్మ ప్లాట్‌ను విక్రయించాలని వత్తిడి చేశాడు. దీనికి సదరు మహిళ అంగీకరించకపోవడంతో తనకు ప్లాట్‌ దక్కడం లేదని కక్ష పెంచుకున్నాడు. రాత్రికి రాత్రే బాధిత మహిళకు సంబంధిచిన ప్లాట్‌లో ఉన్న చెట్టుకింద బండరాయిని పాతించి దేవుడు వెలిసినట్లు తెల్లవారు పూజలు జరిపించారు. ఆలయం ఉన్నచోట ఇంటి నిర్మాణం చేయరాదనే భయాన్ని సృష్టించాడు. అయితే తనకు స్థలంను కేటాయించిన సమయంలో ఎలాంటి దేవుని విగ్రహం లేదని తాను ప్లాటును విక్రయించడానికి అంగీకరించకపోవడంతోనే తనపై కోపంతో నాటకం ఆడుతున్నారని ఆ మహిళ ఆరోపిస్తోంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు అండగా నిలువాల్సిన వారు ప్లాటుపై కన్నేసి దేవుని పేరుతో నాటకం ఆడటాన్ని ఆమె దుయ్యట్టారు. ఇప్పటికైనా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల విషయంలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

దేవుడు వెలిశాడని వేధిస్తున్నారు..
నాకు ఇందిర మ్మ ఇంటి స్థ లం కేటాయించినప్పుడు ఎ క్కడ కూడా దే వుని విగ్రహం లేదు. ఇంటి ప్లాట్‌ను విక్రయించడా నికి అంగీకరించకపోవడంతో కొంద రి ప్రోద్బలంతో కాలనీలోని ఒక నా యకుడు దేవుడు వెలిసినట్లు నాట కం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో బాధల్లో ఉన్న నాకు ఎవరు దిక్కు. అధికారులు స్పందించి దీనిపై విచా రణ జరిపించాలి.    – లక్ష్మి,ఇందిరమ్మ లబ్ధిదారు, మోర్తాడ్‌

మరిన్ని వార్తలు