గిచ్చితే రెచ్చిపోతా

11 May, 2014 02:11 IST|Sakshi
గిచ్చితే రెచ్చిపోతా

కేసీఆరే రాజకీయ వ్యభిచారి: పొన్నాల

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గిచ్చితే తాను మరింతగా రెచ్చిపోతానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరిం చారు. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు రంగులు మార్చే కేసీఆరే అసలైన వ్యభిచారి అని మండిపడ్డారు. ‘‘ఆకలితో, అవమాన భారంతో, కసితో అమెరికా వెళ్లొచ్చిన నన్ను విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు. టీఆర్‌ఎస్‌ను చీలుస్తానంటూ నేనెన్నడూ మాట్లాడలేదు. అలాంటప్పుడు సంజాయిషీ ఇవ్వాల్సిన ఖర్మ నాకు లేదు. 55 మంది తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ టికెట్లిచ్చారు. వారు గెలిస్తే ఎక్కడ టీఆర్‌ఎస్‌ను వీడతారోననే భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్‌గాంధీకి మద్దతిస్తాననడం కూడా ఆ భయంతోనే తప్ప కేసీఆర్ చిత్తశుద్ధి లేదు. ఆయన నిజంగా మాకు మద్దతిస్తే స్వాగతిస్తాం. కానీ ఆయన మాటలు నమ్మలేం’’ అంటూ తూర్పారబట్టారు. పొన్నాల గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

  కేసీఆర్! నన్ను బ్రోకరంటావా? నువ్వు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో మనుషుల అక్రమ రవాణా, అక్రమ పాస్‌పోర్టుల జారీ వంటి నీ దందాలు బయటపడలేదా? యువజన కాంగ్రెస్ నుంచి నిన్ను బయటకు పంపుతారని తెలుసుకుని ఎన్టీఆర్ పంచన చేరలేదా?తరవాత చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మంత్రి పదవి పొందలేదా? బాబు నీకు మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్‌ఎస్ పెట్టలేదా?   2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఫలితాలు రాకముందే ఎన్డీయే వైపు వెళ్లలేదా? మొన్న ఎన్డీఏకు, నిన్న థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తానన్లేదా? ఈ రోజు మళ్లీ మాట మార్చి రాహుల్‌కు మద్దతిస్తానని అనడం లేదా? రోజుకో మాట మార్చే నీ నైతిక విలువలేమిటి? దీన్ని రాజకీ య వ్యభిచారం కాక మరేమంటారు? టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చీల్చాల్సిన అవసరం మాకు లేదు.
 

మరిన్ని వార్తలు